ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ కేపిటల్ పెట్టుబడుల్లో రెట్టింపు వృద్ధి!

by Disha Web Desk 17 |
ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ కేపిటల్ పెట్టుబడుల్లో రెట్టింపు వృద్ధి!
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొంతకాలంగా భారత స్టాక్ మార్కెట్లలో భారీగా ప్రైవేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ కేపిటల్(వీసీ) పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరిలో గతేడాదితో పోలిస్తే ఏకంగా రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగాయి. గత నెలలో పీఈ, వీసీ పెట్టుబడులు 5.8 బిలియన్ డాలర్లు(రూ. 44 వేల కోట్లు)గా ఉన్నాయి. 2021, ఫిబ్రవరిలో 2.5 బిలియన్ డాలర్లు(రూ. 19 వేల కోట్లు)గా నమోదయ్యాయి. అలాగే, ఈ ఏడాది జనవరిలో నమోదైన 4.6 బిలియన్ డాలర్ల(రూ. 35 వేల కోట్ల) కంటే 24 శాతం పెరిగాయి.

ఐవీసీఏ-ఈవై తాజా నివేదిక ప్రకారం.. పీఈ, వీసీ పెట్టుబడుల్లో అత్యధికంగా 88 శాతం రియల్టీ, మౌలిక సదుపాయాల రంగాలు కాకుండా ప్యూర్‌ప్లే పెట్టుబడులు ఉండడం విశేషం. పెట్టుబడి ఒప్పందాలు సంఖ్యా పరంగా సమీక్షించిన నెలలో 33 శాతం పెరిగి 117 కి చేరుకున్నాయి. ఇక, భారీ ఒప్పందాలకు సంబంధించి గత నెల దాదాపు రూ. 33.5 వేల కోట్ల విలువైన 17 పెద్ద ఒప్పందాలు జరిగాయి. జనవరితో పోలిస్తే ఈసారి 24 శాతం పెరిగాయి. మొత్తం పెట్టుబడుల్లో సగం వరకు నిధులు స్టార్టప్‌లలోకి మళ్లడం గమనార్హం.



Next Story

Most Viewed