సినిమా పాతదే.. కానీ కథాంశం ఎప్పటికీ కొత్తదే!

by Muthe.Rajitha |

పిల్లలది ఒక అద్భుతమయిన వూహా ప్రపంచం. ఆ ప్రపంచంలో ఎన్నో కలలు వుంటాయి.

సినిమా పాతదే.. కానీ కథాంశం ఎప్పటికీ కొత్తదే!
X

పిల్లలది ఒక అద్భుతమయిన వూహా ప్రపంచం. ఆ ప్రపంచంలో ఎన్నో కలలు వుంటాయి. కథలుంటాయి,పాటలుంటాయి, బొమ్మలుంటాయి, సినిమాలుంటాయి సినిమా నటులూ వుంటారు. అంతే కాదు వారి నమ్మకాలు విశ్వాసాలూ స్వచ్ఛంగానూ స్వార్థ రహితంగానూ వుంటాయి. నమ్మిందాన్ని సంపూర్ణంగా నమ్మడం పిల్లల మనస్తత్వంలో భాగం. నిజానికి పాఠశాల అంటే ఒకప్పుడు అందమయిన తోట, అప్పుడు పాఠశాల అంటే చెట్టు నీడలో కూర్చుని అక్షరాలను పూయించే గురువు. ఇప్పుడు అది గిడ్డంగిగా మారింది. ఎయిర్ కండిషన్డ్ గదుల్లో పిల్లల ఊపిరిని కొలిచే మార్కుల యంత్రంగా మారింది. ఈ మార్పు ఒక్క రోజులో వచ్చింది కాదు. క్రమంగా వచ్చింది కానీ దాని ప్రభావం తీవ్రమయింది. ‘పాఠశాల’ సినిమా ఈ మార్పును సూచిస్తూ దాని పర్యవసానాల మీద తీసిన సినిమా.

ఎప్పుడయితే విద్యావ్యవస్థలో వాణిజ్యీకరణ మొదలయిందో అప్పటినుండే భారతీయ విద్యా వ్య వస్థ దిగజారడం మొదలయింది. అది ముఖ్యంగా దిగువ తరగతి కుటుంబాల సాధారణ జీవితాన్నీ తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు అన్ని చోట్ల ఉత్తమ స్థాయిలో విద్య అందించలేకపోవడంతో, ఒక స్థాయి విద్య పొందాలంటే ఫీజులతో పాటు “డొనేషన్” చెల్లించడం ఒక సంప్రదాయంలా మారిపోయింది. తగినంత డొనేషన్ చెల్లించలేకపోతే ప్రవేశం నిరాకరించడం ఇది నేటి సమాజంలో సాధారణంగా కనిపించే దృశ్యం. దీనిని “విద్యలో పరోక్ష అవినీతి”గా పేర్కొనవచ్చు. ఈ స్థితికి కేవలం పాఠశాల నిర్వహణను మాత్రమే నిందించడం సరైంది కాదు. పేరున్న, ప్రతిష్ట ఉన్న, అనేక అదనపు కార్యక్రమాలు ఉన్న పాఠశాలలకే తల్లి దండ్రులు పరుగులు తీస్తున్నారు. ఇది కూడా మన సమాజం లోని ఒక లోపం. ఈ దృక్పథాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ.

విద్యా మార్కెట్‌లో మంచి ర్యాంకు రాకపోతే...

‘పాఠశాల’ సినిమా విషయానికి వస్తే సరస్వతి విద్యామందిర్ ప్రిన్సిపల్ ఆదిత్య సహాయ్ (నానా పటేకర్) విద్య విలువల పట్ల ఎంతో అంకితభావం కలిగిన వ్యక్తి. తన పాఠశాల “విద్యా మార్కెట్” లో మంచి ర్యాంకు ప్రాముఖ్యత పొందలేకపోవడంతో నిద్రలేని రాత్రులను గడుపుతూ వుంటాడు. మేనేజ్మెంట్ లాభాలు సాధించకపోతే స్కూలును మూసేస్తామంటుంది. కానీ తమ స్కూల్లో ఆధునిక సౌకర్యాలు, పద్ధతులు విద్యార్థులకు అందుబాటులో లేకపోవడం వల్ల, పోటీ ప్రపంచంలో నిలవాలంటే మార్పు అవసరమని భావిస్తాడు. అందుకే ఉపాధ్యాయులలో కొత్త ఆలోచనలను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తాడు.

ఫీజు చెల్లించనివారికి శిక్షలు

రాహుల్ (షాహిద్ కపూర్) కొత్తగా చేరిన ఉపాధ్యాయుడు. అతనికి విద్యా వ్యవస్థపై ఆధునిక దృక్పథం ఉంది. అదే సమయంలో అతని స్వభావం ఎంతో స్నేహపూర్వకంగా, విద్యార్థులకు దగ్గరగా ఉంటుంది. అంజలి (అయేషా టాకియా) పోషకాహార నిపుణురాలే కాకుండా సంగీత ఉపాధ్యాయురాలు కూడా. అలాగే ఇతర ఉపాధ్యాయులందరూ తమవంతు కృషితో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఒక సంఘటన ఈ కథను మలుపు తిప్పుతుంది. పాఠశాల మేనేజ్మెంట్ స్కూలులో విద్య కంటే ప్రచారం, లాభాలపైనే దృష్టి పెడుతుంది. ఫీజుల పెంపు మాత్రమే కాకుండా ఫీజులు చెల్లించని విద్యార్థులను శిక్షించడం, వివక్ష చూపడం, అసమానంగా చూడ్డం వంటి అంశాలు ఉపాధ్యాయులకు అంగీకారయోగ్యం కావు. అయినా వాళ్ళు తమ అసంతృప్తిని బయటపెట్టలేక మౌనంగా సర్దుకుపోతారు.

ఆదాయం కోసం రియాలిటీ షోలు

స్కూలు ప్రచారం కోసం, ఆదాయం కోసం మీడియా ముందు రియాలిటీ షోలను నిర్వహించడం మొదలవుతుంది. క్రీడా ప్రచారాలు లాంటివి విద్యార్థులపై అనవసర ఒత్తిడిని పెంచుతాయి. అధిక ధరలతో విద్యార్థుల్లో అనారోగ్యకర ఆహారపు అలవాట్లు వారి రోజువారీ ఆనందాన్ని దోచుకుంటాయి. అలాగే వ్యాపార రియాల్టీ కార్యక్రమాల్లో విఫలం కావడం మరో సమస్యగా మారుతుంది. ఇదంతా చూసి అందరు టీచర్లు ప్రిన్సిపల్ ముందు అసంతృప్తిని వెళ్లగక్కుతారు. పరిస్థితిలో మార్పు రాకుంటే అందరమూ రాజీనామా చేస్తామని అంటారు. ప్రిన్సిపల్ మీ ఇష్టం అని ముఖం తిప్పేసుకుంటాడు. స్కూల్లో దశాబ్దాలుగా పని చేస్తున్న అటెండర్ వారిని వారిస్తాడు. మీరు వెళ్లిపోతే కొత్త వాళ్ళను తీసుకునేందుకు మేనేజ్మెంట్ సిద్దమవుతున్నది, మీరు పోతే ఈ విద్యార్థుల్ని పట్టించుకునే వాళ్లుడరు అంటాడు. అందరూ ఆలోచనలో పడతారు.

మేమంతా మీ బలం.. మీరు ఓడిపోరు..!

ఈ నేపథ్యంలో, పాఠశాలలో జరుగుతున్న మార్పుల వెనుక అసలు కారణం ఏమై వుంటుందని రాహుల్ (షాహిద్ కపూర్) రాత్రిపూట అటెండర్ సాయంతో ఫైల్స్ చూస్తాడు. విషయం గ్రహిస్తాడు. ఆ తరువాత విద్యార్థులందరూ ఒక రోజు సమ్మెకు దిగుతారు. ఈ సంఘటనతో సరస్వతి విద్యామందిర్ వార్తల్లోకి తీసుకువస్తుంది. మీడియా ప్రభావంతో ప్రభుత్వ పెద్దలనుంచి వొత్తిడి కూడా వస్తుంది. ప్రిన్సిపల్ సహాయ్ విద్యార్థుల ముందుకు వచ్చి తన నిస్సహాయత వ్యక్తం చేసి రాజీనామాకు తయారవుతాడు. అప్పుడు రాహుల్ ప్రిన్సిపల్ దగ్గరకువచ్చి 'ఈ పిల్లలూ మేము అంతా మీ బలం మీరు ఓడిపోరు' అంటూ సమర్తిస్తాడు. మేనేజ్మెంట్ దిగి వస్తుంది. కథ సంతోషకర ముగింపుకు చేరుతుంది.

ఆలోచన మాట్లాడుతుంది

సినిమాలో నానా పటేకర్ స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా ఒక మనిషి కాదు ఒక ఆలోచన మాట్లాడుతుంది. అతని కళ్ళలో పిల్లల బాధకు ప్రతిధ్వని ఉంది. “విద్య అంటే పిల్లలను గెలిపించడం కాదు వారిని మనుషులుగా నిలబెట్టడం”. పిల్లలు ఒకప్పుడు గాలిపటాల్లా ఎగిరేవారు ఇప్పుడు మార్కుల బరువుతో నేలమీద నడవలేకపోతున్నారు. వారి కళ్ళలో ఆటలు లేవు ఆందోళన ఉంది వారి నవ్వుల్లో స్వేచ్ఛ లేదు సందేహం ఉంది. ఈ సారాశంలో సినిమా ఈ నిశ్శబ్దాన్ని వినిపిస్తుంది. మనసును తాకుతుంది. మనల్ని ఆలోచింపజేస్తుంది. సినిమా పాతదే కానీ కథాంశం ఎప్పటికీ కొత్తదే. తప్పకుండా చూడాల్సిన సినిమా యూట్యూబ్ లో వుంది.

సినిమా: పాఠశాల (హిందీ)

నటీనటులు: నానా పటేకర్, శాహిద్ కపూర్, ఆయెషా టాకియా మొ..

దర్శకత్వం: మిలింద్ ఊకే

లభ్యం: యూట్యూబ్

సమీక్షకులు

వారాల ఆనంద్

94405 01281

Next Story