- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీకి తాగి వచ్చిన సీఎం?? ఆల్కో మీటర్ టెస్టుకు విపక్షాల పట్టు
పంజాబ్ అసెంబ్లీ వేదికగా CM భగవంత్ మాన్ ప్రవర్తనపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు పెను సంచలనాన్ని సృష్టించాయి.

దిశ, వెబ్ డెస్క్ : పంజాబ్ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రవర్తనపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు దేశ రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం మాట్లాడుతున్నప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్, మాట తీరు అత్యంత అసాధారణంగా ఉన్నాయని, ఆయన మద్యం సేవించి సభకు వచ్చారేమోనన్న అనుమానం కలుగుతోందని విపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా, కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖపాల్ సింగ్ ఖైరా తీవ్ర స్థాయి ఆరోపణలు చేసారు. కేవలం ఆరోపణలు చేయడమే కాకుండా, సభలోని పారదర్శకతను నిరూపించడానికి ముఖ్యమంత్రితో పాటు అధికార, ప్రతిపక్ష బెంచీల్లోని ఎమ్మెల్యేలందరికీ తక్షణమే ఆల్కో మీటర్, డోప్ టెస్టులు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ వివాదంపై బిజెపి రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ ఈ అంశంపై స్పందిస్తూ సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిపై విమర్శల వర్షం కురిపించారు. భగవంత్ మాన్ గతంలో కూడా గురుద్వారాలు, ఆలయాలు, లోక్సభ వంటి అత్యున్నత వేదికలకు మద్యం మత్తులోనే వెళ్లిన చరిత్ర ఉందంటూ ఆమె సంచలన పోస్ట్ చేశారు. ఆయనకు వెంటనే డ్రగ్, ఆల్కహాల్ పరీక్షలు నిర్వహించాలని, ఒకవేళ ఆ ఆరోపణలు నిజమని తేలితే నైతిక బాధ్యత వహిస్తూ ఆయనను పదవి నుండి తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి ప్రవర్తనతో రాష్ట్ర గౌరవాన్ని దిగజారుస్తున్నారని ఆమె మండిపడ్డారు.
మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఈ ఆరోపణలను పూర్తిగా నిరాధారమైనవిగా కొట్టిపారేసింది. విపక్షాలు చేస్తున్నవన్నీ కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యలని, ముఖ్యమంత్రి పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ఇలాంటి చౌకబారు ఆరోపణలకు దిగుతున్నారని ఆప్ నాయకులు ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ ప్రతిష్టను, ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా కాంగ్రెస్, బిజెపిలు కుమ్మక్కై ఈ డ్రామా ఆడుతున్నాయని వారు మండిపడ్డారు. స్పీకర్ కూడా విపక్షాల డిమాండ్ను తోసిపుచ్చినట్లు సమాచారం అందుతున్నప్పటికీ, ఈ అంశం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.






