ఆన్‌లైన్ మ్యాట్రిమోనియల్ ప్లాట్ ఫామ్స్ సైబర్ నేరగాళ్లకు అడ్డాగా మారుతున్నాయి: సుప్రీంకోర్టు

by Malleboina Mahesh |

ఇటీవల ఆన్‌లైన్ మ్యాట్రిమోనియల్ అయిన Shaadi.com వేదికగా వరుసగా జరుగుతున్న సైబర్ నేరాలు, మోసాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఆన్‌లైన్ మ్యాట్రిమోనియల్ ప్లాట్ ఫామ్స్ సైబర్ నేరగాళ్లకు అడ్డాగా మారుతున్నాయి: సుప్రీంకోర్టు
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల ఆన్‌లైన్ మ్యాట్రిమోనియల్ అయిన Shaadi.com వేదికగా వరుసగా జరుగుతున్న సైబర్ నేరాలు, మోసాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆన్‌లైన్ మ్యాట్రిమోనియల్ ప్లాట్‌ఫామ్ (Online matrimonial platform)లు సైబర్ నేరగాళ్లకు అడ్డాగా మారుతున్నాయని ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం షాదీ డాట్ కామ్ (Shaadi.com) వేదికగా జరిగిన ఒక భారీ మోసం కేసులో.. ఆ సంస్థ ఫౌండర్ అనుపమ్ మిట్టల్‌పై ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. ఆ నేపథ్యంలో వారు సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. అత్యున్నత న్యాయస్థానం క్షుణ్ణంగా పరిశీలించింది. మ్యాట్రిమోనియల్ సైట్లు వినియోగదారుల వివరాలను సరిగ్గా వెరిఫై చేయకపోవడం వల్ల సైబర్ నేరగాళ్లకు మార్గం సులువుగా మారుతోందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.

ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు..

కొద్ది రోజుల క్రితం రాజమహేంద్రవరానికి చెందిన జోగాడ వంశీకృష్ణ అనే వ్యక్తి, షాదీ డాట్ కామ్‌ (Shaadi.com)లో యానాం ఎమ్మెల్యే ఫోటోతో ఫేక్ ప్రొఫైల్ సృష్టించాడు. తనను తాను సంపన్న వ్యాపారవేత్తగా పరిచయం చేసుకుని, జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ మహిళా డాక్టర్‌ని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అనంతరం అతనిపై ఆమెకు పూర్తి నమ్మకం వచ్చిన తర్వాత అసలు గేమ్ మొదలు పెట్టాడు. తన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, బ్యాంక్ అకౌంట్లు ప్రస్తుతం జప్తులో ఉన్నాయని నమ్మించి మహిళా డాక్టర్ వద్ద రూ. 11 లక్షలు వసూలు చేశాడు. కొద్ది రోజుల తర్వాత మహిళా డాక్టర్ (Female doctor) తన డబ్బులు తిరిగి అడగ్గా.. ఆమెను బెదిరించాడు. ఫోటోలు మార్ఫింగ్ చేసి.. సోషల్ మీడియాలో పెడతానని దబాయించాడు. దీంతో ఆమె మోసపోయినట్టు గుర్తించి పోలీసులను ఆశ్రయించగా నిందితుడి అసలు రంగ్గు బయపడింది. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను నిందితుడితో పాటు షాదీ డాట్ కామ్ యాజమాన్యం (Shaadi.com is owners)పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం

ఫ్రాడ్ కేసులో నిందితుడితో పాటు షాదీ డాట్ కామ్ యజమానిపై కేసు నమోదైంది. దీంతో తనపై ఉన్న ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని అనుపమ్ మిట్టల్ (Anupam Mittal) తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) పిటిషన్ దాఖలు చేశాడు. అతని పిటీషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. అయితే, దీనిపై పునఃసమీక్ష జరపాలని, అంశాల వారీగా స్వతంత్ర నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. అలాగే అనుపమ్ మిట్టల్‌పై రాబోయే ఎనిమిది వారాల పాటు ఎటువంటి కఠిన చర్యలు (అరెస్ట్ వంటివి) తీసుకోకూడదని ధర్మాసనం మధ్యంతర రక్షణ కల్పించింది.

దీంతో పాటుగా.. ఇంటర్మీడియరీ సంస్థలు తమ ప్లాట్‌ఫారమ్‌లపై జరిగే నేరాలను అడ్డుకోవడంలో మరింత బాధ్యతాయుతంగా ఉండాలని కోర్టు సూచించింది. ఈ కేసులో సుప్రీం తీర్పుతో మ్యాట్రిమోనియల్ సైట్స్ వెరిఫికేషన్ ప్రక్రియలపై తీవ్రమైన చర్చ మొదలైంది. ఇకపై ఇటువంటి సంస్థలు తమ వినియోగదారుల భద్రత విషయంలో మరింత కఠినమైన నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Next Story