దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా.. తెరవెనుక దాగున్నది ఎవరు?

by Dishanational2 |
దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా.. తెరవెనుక దాగున్నది ఎవరు?
X

దిశ, శామీర్ పేట్ : రోజు రోజుకి భూముల ధరలు ఏకంగా ఆకాశానికి తాకుతున్నాయి. ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. ఎప్పటికైనా భూమి విలువ పెరుగుతుంది కానీ తగ్గదు అని తెలుసుకున్న ప్రజలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా భూముల పైన కన్ను వేశారు. ఖాళీ స్థలం కనబడితే చాలు కబ్జా చేయాల్సిందే తమ పేరిట బోర్డు పాతాల్సిందే. ఇక వివారాల్లోకి వెళ్తే.. శామీర్ పేట్ మండలంలోని బొమ్మరాసి పేట్ రెవెన్యూ పరిధిలో గల సర్వే నెంబర్. 358 లోని సుమారు 4 ఎకరాల 25 గుంటల ప్రభుత్వ భూమి కబ్జా‌కి గురైందని స్థానికులు చెబుతున్నారు.

దర్జాగా కబ్జా..

శామీర్ పేట్ మండలంలోని బొమ్మరాసి పేట్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 358 ఆ/5 లోని 4 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు అక్రమార్కులు దర్జాగా కబ్జా చేశారని ప్రజలు తెలిపారు. ఈ ప్రభుత్వ భూమి వాసవి గ్రూప్ (గ్రీన్ లీఫ్) సంస్థ గత కొంత కాలం కింద సుమారు 72 ఎకరాల్లో లే ఔట్ చేశారు. ఇప్పుడు అందులో ప్రభుత్వ స్థలం ఉంది కానీ అందులో ప్రభుత్వ భూమి సుమారు 4 ఎకరాల 25 గుంటల భూమి ఉన్నట్టు ఎవరికి తెలియదు అని అనుకున్నారో ఏమో కబ్జా చేశారు. గుట్టు చప్పుడు కాకుండా విషయం బయటకి రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ లే ఔట్‌లోకి ఎవరిని వెళ్ళనివ్వడం లేదని స్థానికులు చెబుతున్నారు. వెంచర్ నిర్వాహకులు ప్రైవేట్ వ్యక్తులను కాపలాగా ఉంచి ఎవరిని వెళ్ళనివ్వకుండా చూసుకుంటున్నారు. ఒక వేళ లోపలికి వెళ్లాల్సి వస్తే వివరాలు ఇవ్వాలని వాహనాల నెంబర్, ఇంకా ఫోన్ నెంబర్ తీసుకొని ఫోటో తీసుకొని లోపలికి అనుమతిస్తున్నారు. ఎక్కడ గుట్టు బయట పడుతుందోననే భయం, అక్కడికి ప్రజలు వెళ్లాలంటనే భయపడుతున్నారు. ప్రభుత్వ భూమి అంటే ప్రజాలది కదా కాబట్టి మాదే అనుకుంటే తప్పేముంది అని అనుకున్నారో ఏమో కబ్జా చేశారు.

ప్రభుత్వ భూములకు రక్షణ కరువు..

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయింది. ఖాళీ స్థలం కనబడితే చాలు కబ్జా చేస్తున్నారు. అమాయక ప్రజలను మోసం చేస్తూ విక్రయిస్తున్నారు. కొనుగోలు చేసిన తరువాత విషయం తెలుసుకున్న వారు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. అసలు ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత సబంధితశాఖ అధికారులది కాదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ తెలిసినా కూడా తెలియనట్టు వ్యవహరిస్తున్నారా అని ఆశ్చర్యపోతున్నారు. ముడుపులు తీసుకోవడం‌లో ఉన్న శ్రద్ధ వారి పని తీరు పై లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు బడా బాబులు, నాయకులతో చేతులు కలిపే ఈ తంతు నడిపిస్తున్నారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.

రెచ్చిపోతున్న రియల్టర్లు..

కొందరు అక్రమార్కులు సులభంగా డబ్బులు సంపాదించాలి అనే ఆలోచనలతో ఖాళీ‌గా ఉన్న భూముల పై కన్నెస్తున్నారు. కబ్జా చేసి విక్రయిస్తున్నారు. కొందరు అక్రమార్కులు అధికారులను, చోటా మోటా నాయకులను కలుపుకొని వారి చేతులు తడుపుతూ యథేచ్ఛగా దర్జాగా కబ్జా చేస్తున్నారు. అధికారుల అండదండలు పుష్కలంగా ఉండడంతోనే అక్రమార్కులు కబ్జాలు చేస్తూ రెచ్చిపోతున్నారని చెబుతున్నారు. వారి కబ్జాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెర వెనుక దాగున్నది ఎవరు..?

గతంలో ఈ వెంచర్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి బెదిరించాడని ఆడియో లీక్ అయి వైరల్ అయిన విషయం అందరికి తెలిసిందే. మరి ఇప్పుడు అదే వెంచర్ ఇనాగ్రషన్ కు మంత్రి మల్లా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అంటే దానికి కారణం ఏమిటా అని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. నిజంగా అటు అధికారులకు ఇటు మంత్రికి ప్రభుత్వ స్థలం వెంచర్ లో ఉంది అన్న సంగతి తెలియదా లేక తెలిసినా తెలియనట్టు ఉంటున్నారా అని ప్రజలు ఆలోచనలో పడ్డారు. ప్రభుత్వ భూమి‌కి ప్రైవేట్ వ్యక్తుల రక్షణ ఏమిటో చుట్టూ ప్రహారి గోడను నిర్మించారు. అలాగే వెంచర్ జెండాలను కూడా ప్రహారి గోడకు పాతారు. ఇందులో విచిత్రం ఏమిటంటే అధికారులే వెంచర్ నిర్వాహకులు, ప్రహారి గోడ ప్రభుత్వ భూమి రక్షణ కోసం నిర్మించారు అని సమాధానం ఇవ్వడంతో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో పెద్ద పెద్ద నాయకులు కూడా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారికి చేతులు తడిపారు అనే ఉద్దేశ్యంతో నే దర్జాగా కబ్జా కు పాల్పడుతున్నారని చెబుతున్నారు. తెర వెనుక ఎవరూ లేనప్పుడు నామ మాత్రంగా బోర్డు పెట్టాల్సిన పని ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ స్థలం ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేసినా కూడా వివరాలు పూర్తిగా ఎందుకు పెట్ట లేదు..? అంటే దాని అర్ధం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అసలు సబంధితశాఖ అధికారులు ఉన్నా కూడా ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది అంటే వారి పని తీరు బాగా లేదని ప్రజలు అంటున్నారు. తెర వెనుక ఎవరు ఉన్నారు అనే విషయం దిశ పత్రికలో మరో కథనంలో.

తెలిసినా తెలియనట్టు వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు

ప్రభుత్వ భూమి కబ్జా అయిన విషయం తెలిసినా కూడా పట్టించుకోవడం లేదని ప్రజలు చెబుతున్నారు. పలు సార్లు ఫిర్యాదు చేసిన కూడా పట్టించుకోకుండా ఏదో ఒకటి చెప్పి దాటివేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ భూమి కబ్జా విషయంలో అన్ని తెలిసినా ఉన్నత అధికారులు స్పందించడం లేదంటే ఆంతర్యం ఏమిటో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని కబ్జా నుండి విముక్తి చేసి ప్రజావాసరాలకు వినియోగించాలని కోరుతున్నారు.

Next Story