పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని.. సమ్మె నోటీస్

by Vinod kumar |   (  Updated:2022-03-16 11:04:25  IST  )

దిశ, సిద్దిపేట: పంచాయతీ - Notice of strike under the auspices of Telangana Gram Panchayat Employees and Workers Union CITU

పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని.. సమ్మె నోటీస్
X

దిశ, సిద్దిపేట: పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి తునికి మహేష్ డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నారాయణరావుపేట మండల అభివృద్ధి అధికారి మురళీధర్ శర్మ, మండల పంచాయతీ శ్రీనివాస్ లకు సమ్మె నోటీసు ఇచ్చారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ వర్కర్లను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 28, 29 తేదీల్లో జరిగే సార్వత్రిక సమ్మెలో గ్రామపంచాయతీ కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు.


రాష్ట్ర సీఎం కేసీఆర్ 2022 మార్చి 9న అసెంబ్లీలో కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని ప్రకటించారు. ఈ విధంగా గ్రామ పంచాయితీల్లో పనిచేసే కారోబార్, బిల్ కలెక్టర్, పంచాయతీ సిబ్బందికి కూడా ఉద్యోగ భద్రత కల్పించి, పర్మినెంట్ చేయాలని కోరారు.

ప్రస్తుతం పనిచేస్తున్న కారోబార్, బిల్ కలెక్టర్ ను యధావిధిగా కొనసాగించాలని మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. బలవంతంగా బాండ్ పేపర్ రాయించుకున్న వాటిని తిరిగి కార్మికులకు ఇవ్వాలని, ప్రస్తుతం పనిచేస్తున్న వారందరినీ పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు.


500 జనాభాకు ఒకరు సిబ్బందిగా ఉండాలనే నిబంధనను రద్దు చేయాలని, ఆదాయ వనరులు కలిగిన గ్రామ పంచాయితీల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ ప్రతి నెలా రూ.8,500/-లు వేతనం కాకుండా పంచాయతీ తీర్మానం చేసి అదనంగా వేతనాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఎస్కే-డే పేరిట ప్రవేశపెట్టిన రూ.2,00,000/-లు ఇన్సూరెన్స్ ని వెంటనే అమలు చేయాలని, 60 సంవత్సరాలు దాటిన వారికి ఎక్స్ గ్రేషియా(నష్టపరిహారం) చెల్లించాలన్నారు. పిఎఫ్, ఇఎస్ఏ అమలు చేయాలని తదితర డిమాండ్లతో ఈ నెల 28, 29న జరిగే సార్వత్రిక సమ్మెలో గ్రామపంచాయతీ కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

Next Story