అసెంబ్లీలోనే కేటీఆర్ చుట్టూ చేరిన ఎమ్మెల్యేలు

by Disha Web Desk |
అసెంబ్లీలోనే కేటీఆర్ చుట్టూ చేరిన ఎమ్మెల్యేలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఒకవైపు అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలు జరుగుతుండగానే పలువురు ఎమ్మెల్యేలు మంత్రి కేటీఆర్‌ను చుట్టుముట్టారు. వారికి అవసరమైన పనుల విషయమై మాట్లాడడానికి దరఖాస్తులు ఇవ్వడానికి పోటీ పడ్డారు. సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై స్టేట్‌మెంట్ ఇవ్వడం పూర్తికాగానే బడ్జెట్‌పై చర్చ మొదలైంది. మజ్లిస్ సభ్యుడు అక్బరుద్దీన్ కీలకమైన అనేక అంశాలపై ప్రసంగిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, దివాకర్‌రావు, రేఖానాయక్ తదితర పలువురు ఎమ్మెల్యేలు ఆయన కూర్చున్న సీటు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. ఒకరితో మాట్లాడుతుండగానే మరో ముగ్గురు వచ్చి పోగవడంతో ఒక మినీ ఛాంబర్‌లాగా అక్కడి వాతావరణ మారిపోయింది.

జీహెచ్ఎంసీకి, పురపాలక శాఖకు సంబంధించిన పలు అంశాలను అక్బరుద్దీన్ ప్రస్తావిస్తున్నా ఆ శాఖ మంత్రిగా వాటిని వినడానికి కేటీఆర్‌కు అవకాశం చిక్కలేదు. ఒక దశలో ఎమ్మెల్యేల ధాటికి తట్టుకోలేక కొద్దిసేపు సీటును ఖాళీ చేసి బైటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇదే సమయానికి స్పీకర్ విరామం ఇవ్వడంతో హడావిడి తగ్గిపోయింది. ఏ సమస్య ఉన్నా కేటీఆర్‌కు చెప్పుకోవాలనే వాతావరణం కొద్దిసేపు అక్కడ నెలకొన్నది. నిజానికి ఎమ్మెల్యేలకు మిగిలిన సందర్భాల్లో కేటీఆర్‌ను కలవడానికి అవకాశం లేకపోవడంతో అసెంబ్లీ సమావేశాల్లోనైనా వారి పనిని చేయించుకోవాలని ఎమ్మెల్యేలు భావించారు. అందులో భాగమే తగిన సమయాన్ని చూసుకుని ఆయన దగ్గరకు వెళ్ళి దరఖాస్తులు ఇచ్చి విషయాన్ని వివరించాల్సి వస్తున్నది.

Next Story

Most Viewed