పిల్లులు లేని బడికి రెండేళ్లుగా జీతం తీసుకుంటున్న టీచర్

by Dishanational1 |
పిల్లులు లేని బడికి రెండేళ్లుగా జీతం తీసుకుంటున్న టీచర్
X

దిశ, బాన్సువాడ: నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుంది కోటగిరి భవిత ప్రభుత్వ పాఠశాల పరిస్థితి. శారీరక, మానసిక వికలాంగులకు విద్య అందించాలని ఇక్కడ ప్రత్యేక పాఠశాల ప్రారంభించారు. లక్ష్యం ఉన్నతం అయినా ఆచరణ నీరుగారుతుంది. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం, నిర్వహణ లోపంతో ప్రభుత్వ నిధులు వృథా అవుతున్నాయి. గత రెండేళ్లుగా ఒక్క విద్యార్థి కూడా ఈ పాఠశాలకు రావడం లేదు. కానీ.. విద్యార్థులు వచ్చినట్టు ఉపాధ్యాయులు హాజరు వేస్తున్నారు. వారి జీతాల కోసం హాజరుకాని విద్యార్థులను హాజరైనట్టు చూపించడం విమర్శలకు దారితీస్తోంది. స్థానిక విద్యార్థి సంఘాలు, విద్యావంతులు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.

ఈ పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులు, ఓ ఆయమ్మ ఉండగా.. గత రెండు నెలల నుంచి ఓ ఉపాధ్యాయురాలు ప్రసూతి సెలవుపై రావడం లేదు. మరో ఉపాధ్యాయుడు వచ్చి సంతకం చేసి వెళ్లిపోతున్నాడని స్థానికులు వాపోతున్నారు. పిల్లలులేని బడికి రెండేళ్లుగా జీతం తీసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. లేని హాజరు చూపించడం వల్ల ప్రభుత్వ నిధులు వృథా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు నెలకు రూ.50వేల నిధులు పక్కదారి పడుతుండటంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ, వికలాంగుల శాఖల అధికారులు స్పందించి ఇక్కడ జరుగుతున్న దొంగ హాజరు నమోదుపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నకిలీ హాజరు చూపిస్తూ.. జీతాలు తీసుకుంటున్నవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చట్ట ప్రకారం నిధుల రికవరీ చేయాలన్నారు. మరి విద్యా, వికలాంగుల శాఖల అధికారులు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.

Next Story