నాలుగేళ్ల ముందే గుండెపోటును పసిగట్టే 'బ్లడ్‌టెస్ట్'

by Disha Web Desk 12 |
నాలుగేళ్ల ముందే గుండెపోటును పసిగట్టే బ్లడ్‌టెస్ట్
X

దిశ, ఫీచర్స్: ప్రస్తుత సాంకేతిక యుగంలో మానవ జీవనశైలి మార్పులు చెందగా, ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు ఉరుకులు, పరుగులతో పనిచేస్తున్నారు. దీంతో సహజంగానే అందరిలోనూ ఒత్తిడి పెరిగింది. ఇలాంటి లైఫ్‌స్టైల్‌కు తోడు ధూమపానం, మద్యపానం, పొల్యూషన్, అవుట్‌సైడ్ ఫుడ్ వంటివన్నీ కూడా యువతరం నుంచి వృద్ధుల వరకు గుండెపోటు వచ్చే అవకాశాన్ని పెంచింది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఓ కొత్తరకమైన రక్త పరీక్ష‌ను అభివృద్ధి చేశారు. రాబోయే నాలుగేళ్లలో హార్ట్‌ఎటాక్, స్ట్రోక్, హార్ట్‌ ఫెయిల్యూర్‌ను ఈ టెస్ట్ అంచనా వేస్తుందన్న పరిశోధకులు.. ఈ హెచ్చరికతో జాగ్రత్త పడొచ్చని అభిప్రాయపడుతున్నారు.

సాధారణంగా గుండెపోటు లక్షణాలున్నాయో లేవో తెలుసుకునేందుకు ఈసీజీ, 2 డీఎకో, యాంజియోగ్రామ్ వంటి పరీక్షలు చేస్తుంటారు. అయితే వీటి ద్వారా రిస్క్ స్కోర్ తెలుసుకునే చాన్స్ ఉండగా.. కొత్త రకమైన బ్లడ్ టెస్ట్ రెట్టింపు కచ్చితత్వంతో ఫలితాన్ని చూపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరీక్షలో రక్తంలోని ప్రోటీన్స్ శాతాన్ని లెక్కించి రిజల్ట్స్ అందించనుండగా.. రోగులకు ప్రస్తుత మందులు పని చేస్తున్నాయా లేదా ప్రమాదాన్ని తగ్గించేందుకు అదనపు మందులు అవసరమా అని నిర్ధారించడానికి వైద్యులకు ఈ టెస్ట్ ఉపయోగపడనుంది. అంతేకాదు క్లినికల్ ట్రయల్స్ సమయంలోనూ కార్డియోవాస్కులర్ ఔషధాల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కూడా ఈ టెస్ట్ ఉపయోగించవచ్చు అని తెలిపారు.

పరిశోధనలో..

దాదాపు 22,849 మంది వ్యక్తుల నుంచి సేకరించిన బ్లడ్ ప్లాస్మా నమూనాల్లోని 5,000 ప్రోటీన్లను విశ్లేషించడానికి పరిశోధకులు మెషిన్ లెర్నింగ్‌ను ఉపయోగించారు. ఈ మేరకు గుండె జబ్బులు వచ్చే సంభావ్యతను అంచనా వేయగల 27 ప్రోటీన్లను పరిశోధకులు గుర్తించారు. ఈ క్రమంలోనే 11,609 మంది వ్యక్తుల్లో ఇప్పటికే ఉన్న రిస్క్ స్కోర్‌ను రెండింతలు కచ్చితత్వంతో సూచించాయి. ఈ పరీక్షను ఇప్పటికే అమెరికాలోని నాలుగు హెల్త్‌కేర్ సిస్టమ్స్‌లో ఉపయోగిస్తుండగా, సమీప భవిష్యత్తులో యూకేకు పరిచయం చేయనున్నట్లు తెలిపారు శాస్త్రవేత్తలు.


Next Story