నీట్ (UG) 2026: విద్యార్థిని ఓఎంఆర్ షీట్ ట్యాంపరింగ్ వివాదంపై ఎన్‌టీఏ (NTA) కీలక క్లారిటీ!

by Malleboina Mahesh |

నీట్ అభ్యర్థిని ఆర్య సింగ్ ఓఎంఆర్ షీట్ వివాదంపై ఎన్‌టీఏ క్లారిటీ.. బయట తిరుగుతున్నది డిజిటల్‌గా ఎడిట్ చేసిన నకిలీ ఓఎంఆర్.. ఆమె మార్కులు 167 మాత్రమేనని స్పష్టం

నీట్ (UG) 2026: విద్యార్థిని ఓఎంఆర్ షీట్ ట్యాంపరింగ్ వివాదంపై ఎన్‌టీఏ (NTA) కీలక క్లారిటీ!
X

దిశ, వెబ్ డెస్క్: తన ఓఎంఆర్ షీట్ ట్యాంపరింగ్ (OMR sheet tampering) జరిగిందని ఓ విద్యార్థిని చేసిన ఆరోపణలపై ఎన్‌టీఏ (NTA) క్లారిటీ ఇచ్చింది. కాన్పూర్‌కు చెందిన విద్యార్థిని ఆర్య సింగ్ (అప్లికేషన్ నంబర్ 260410434102) ఓఎంఆర్ షీట్, మార్కుల వ్యత్యాసంపై చేస్తున్న ఆరోపణలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) తీవ్రంగా ఖండించింది. సదరు విద్యార్థినికి మొదట 609 మార్కులు వచ్చి, ఆ తర్వాత 167 మార్కులకు పడిపోయాయని సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఓఎంఆర్ షీట్ ఇమేజ్ పూర్తిగా నకిలీదని, దానిని డిజిటల్‌గా ఎడిట్ (Digitally Altered) చేశారని ఎన్‌టీఏ స్పష్టం చేస్తూ.. ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. అందులో అసలైన షీట్‌లో ఇన్విజిలేటర్ సంతకం చేసిన సమయం మధ్యాహ్నం 3:45 గంటలుగా ఉంటే, ఫోర్జరీ చేసిన ఇమేజ్‌లో దానిని 2:45 గంటలుగా మార్చారని, అలాగే మరికొన్ని ట్యాంపరింగ్ గుర్తులను కూడా కనుగొన్నట్లు ఎన్టీయే వెల్లడించింది.

అభ్యర్థికి సంబంధించిన అసలైన ఓఎంఆర్ షీట్ తమ రికార్డుల్లో భద్రంగా ఉందని, గతంలోనే దానిని ఆమె రిజిస్టర్డ్ ఈమెయిల్‌కు కూడా పంపించామని ఎన్‌టీఏ పేర్కొంది. ఆర్య సింగ్‌కు అధికారికంగా వచ్చిన 167 మార్కులు మాత్రమే నిజమని, అందులో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పింది. 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024' ప్రకారం ఇలా నకిలీ ఓఎంఆర్ షీట్లను సృష్టించడం, సోషల్ మీడియాలో పుకార్లను వ్యాప్తి చేయడం తీవ్రమైన నేరమని, దీనికి కారణమైన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎన్‌టీఏ హెచ్చరించింది. అలాగే పూర్తి వివరాల కోసం ఎన్టీయే వెబ్ సైట్ ను సందర్శించ వచ్చని ఎన్టీయే ఈ సందర్భంగా సదరు విద్యార్థినికి క్లారిటీ ఇచ్చింది.

Next Story