నత్తనడకన నందికంది ఫ్లైఓవర్ నిర్మాణం.. ట్రాఫిక్ కష్టాలతో నిత్యం నరకయాతన

by Jakkula.Mamatha |

హైదరాబాద్–సోలాపూర్ 65వ జాతీయ రహదారిపై నందికంది వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు నత్తనడకన సాగుతుండటంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నత్తనడకన నందికంది ఫ్లైఓవర్ నిర్మాణం.. ట్రాఫిక్ కష్టాలతో నిత్యం నరకయాతన
X

దిశ, సదాశివపేట: హైదరాబాద్–సోలాపూర్ 65వ జాతీయ రహదారిపై నందికంది వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు నత్తనడకన సాగుతుండటంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారుల్లో ఒకటైన ఈ మార్గంలో ప్రతి రోజూ వేలాది కార్లు, బస్సులు, లారీలు, ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే నిర్మాణ పనులు మందగించడం వల్ల ఈ ప్రాంతంలో తరచూ ట్రాఫిక్ స్తంభిస్తోంది. ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల జాతీయ రహదారిపై ఇరుకుగా ఉండటంతో వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ తీవ్రరూపం దాల్చుతోంది. అత్యవసర సేవలకు వెళ్లే అంబులెన్సులు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిర్మాణ ప్రాంతంలో సరైన హెచ్చరిక బోర్డులు, రాత్రివేళల్లో తగిన వెలుతురు, భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని వాహనదారులు చెబుతున్నారు. ఎండాకాలంలో దుమ్ము, వర్షాకాలంలో బురదతో ప్రయాణం మరింత ఇబ్బందికరంగా మారింది. వ్యాపారులు కూడా తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. ఏళ్లుగా ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తవుతుందని ప్రజలు ఎదురుచూస్తున్నప్పటికీ పనుల పురోగతి ఆశించిన స్థాయిలో లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. సంబంధిత అధికారులు, నిర్మాణ సంస్థ సమన్వయంతో అదనపు యంత్రాలు, సిబ్బందిని ఏర్పాటు చేసి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రజలు, ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. ఫ్లైఓవర్ త్వరగా అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రమాదాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

Next Story