ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారు: నందీశ్వర్ గౌడ్

by Disha Web Desk 19 |
ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారు: నందీశ్వర్ గౌడ్
X

దిశ, అమీన్‌పూర్: రానున్న సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. పటాన్ చెరు పట్టణ కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీ విజయం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజలంతా బీజేపీ వైపే ఉన్నారని పేర్కొన్నారు. యోగి నాయకత్వంలో రెండవ సారి బీజేపీ అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించిందని తెలిపారు.

రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ రెండు సంవత్సరాల పదవి కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సంజయ్ అధ్యక్షుడు అయ్యాక బీజేపీ పార్టీ ఊహించని అద్భుతాలను నమోదు చేసిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. అమీన్‌పూర్‌లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని పేర్కొన్నారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story