Mukhtar Abbas Naqvi: ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మంత్రి?

by Disha Web Desk 19 |
My Political and Social Tenure not yet Over, Says Mukhtar Abbas Naqvi
X

దిశ, వెబ్​డెస్క్​: Mukhtar Abbas Naqvi Meets BJP National President JP Nadda| భారత తదుపరి ఉప రాష్ట్రపతి ఎవరు అనే దానిపై బీజేపీ దృష్టి సారించింది. ఈ రేసులో పలువురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యంలో వైస్ ప్రెసిడెంట్ క్యాండిడెట్‌గా కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ పేరు దాదాపుగా ఖాయం అయినట్లు తెలుస్తోంది. బుధవారం అబ్బాస్ నఖ్వీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కావడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిస్తోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న నఖ్వీకి రాజ్యసభ పదవీకాలం ముగిసినా బీజేపీ పెద్దలు ఆయన సభ్యత్వాన్ని కొనసాగించలేదు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆయన్ను బరిలోకి దింపలేదు. అనంతరం యూపీలో జరిగిన ఓ లోక్ సభ బై ఎలక్షన్ లో పోటీకి నిలుపుతారని అంతా భావించినా అలా జరకపోవడంతో మైనార్టీ వర్గానికి చెందిన నఖ్వీని ఉప రాష్ట్రపతి పోస్టుకు ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.

నఖ్వీ అభ్యర్థిత్వం విషయంలో అనేక అంచనాలను వేసుకున్న బీజేపీ.. త్వరలో తుది నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన కామెంట్స్ దేశ, విదేశాల్లో బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో దేశంలో అల్లర్లు చెలరేగాయి. ఇలాంటి పరిస్థితుల్లో మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తినే వైస్ ప్రెసిడెంట్ క్యాండిడెట్ గా బరిలోకి దించడం ద్వారా పరిస్థితి తీవ్రతను కొంతలో కొంతైనా నివారించడంతో పాటు దీర్ఘకాలంలో పార్టీ వైపు మైనార్టీలను మళ్లించుకునే అవకాశాలు మెరుగుపరుచుకోవచ్చనే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగియనుంది. ఆగస్టు 6న ఎన్నిక జరగనుంది. మంగళవారం నుండి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో బీజేపీ పెద్దలు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు విషయంలో వేగం పెంచారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సామాజిక సర్దుబాట్లను బేరీజు వేసుకుని అభ్యర్థి ఎంపిక ఖరారు చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ఎన్డీయే త‌ర‌పున ఉప రాష్ట్రపతి రేసులో పలువురి పేర్లు ప్రధానంగా తెరపైకి వస్తున్నాయి. వారిలో పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కర్ణాటక ప్రస్తుత గవర్నర్ తావార్ చంద్ గెహ్లాట్, మైనార్టీ కోటాలో కేరళ గవర్నర్ పేరు సైతం ప్రచారంలో ఉంది. అయితే బీజేపీ అధినాయకత్వం ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేరు పైన ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. తాజాగా బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో నఖ్వీ భేటీ కావడం వెనుక తన అభ్యర్థిత్వంపై చర్చించడమే ఎజెండా అనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Next Story

Most Viewed