'బాసర ట్రిపుల్ ఐటీ దుస్థితి చూస్తే బాధేస్తున్నది'

by Disha Web Desk 2 |
బాసర ట్రిపుల్ ఐటీ దుస్థితి చూస్తే బాధేస్తున్నది
X

దిశ, తెలంగాణ బ్యూరో: బాసర ట్రిపుల్ ఐటీ విశ్వవిద్యాలయ దుస్థితి చూస్తే ఆవేదన కలుగుతున్నదని, ఇంత అధ్వానంగా ఉంటాయా? అని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఆదివారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కార్​నిర్లక్ష్యంతో రెగ్యులర్ వైస్ ఛాన్సలర్, డైరెక్టర్‌తో పాటు అధ్యాపక పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయని ఫైరయ్యారు. సరిపడా ప్రొఫెసర్లు లేరని, ల్యాబ్ అసిస్టెంట్లతో పాఠాలు చెప్పించే దుస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది విద్యార్థులకు ఒక్కరే ఫిజికల్ డైరెక్టర్ ఉండడంపై ప్రశ్నించారు. కనీస సౌకర్యాల్లేవని, రేకుల షెడ్లలో పాఠాలు చెబుతుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కుర్చీలు డిజిటల్ బోర్డులు, డెస్క్ లన్నీ శిథిలమయ్యాయని, రేకుల షెడ్ల కింద ఫ్యాన్లు లేకుండా విద్యార్థులు అల్లాడుతున్నా పట్టించుకోకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక ల్యాప్ టాప్, యూనిఫాం, ఐడీ కార్డులు ఎక్కడ ఇస్తుందని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్‌లో పరిస్థితులు మరీ అధ్వానంగా ఉన్నాయని, 9 వేల మందికి 3 మెస్ లు ఉన్నాయనీ, అవి కూడా శుభ్రంగా లేవని బాపూరావు అన్నారు. కనీసం తాగునీటిని అందించలేని ప్రభుత్వం ఎందుకు పాలన సాగిస్తుందో తెలపాలని నిలదీశారు. ఫీజుల కింద ఏటా రూ.40 కోట్లకు పైగా ఆర్జిస్తున్నా కనీస సౌకర్యాలు కల్పించకపోవడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రెగ్యులర్ వీసీ, డైరెక్టర్‌తోపాటు ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులన్నీ భర్తీ చేయాలని డిమాండ్​చేశారు. లేదంటే తీవ్రమైన ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.

Next Story

Most Viewed