జనగామ జిల్లా ఎటూ పోదు.. ప్రజలు టెన్షన్ పడకండి: MP

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-12 12:18:54  IST  )

జనగామ జిల్లా విషయంలో అపోహలు వద్దని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

జనగామ జిల్లా ఎటూ పోదు.. ప్రజలు టెన్షన్ పడకండి: MP
X

దిశ, వెబ్‌డెస్క్: జనగామ జిల్లా విషయంలో అపోహలు వద్దని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. జిల్లాల విభజనపై కొందరు కావాలనే రాజకీయ లబ్ధి కోసం ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. జనగామ జిల్లా విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. వందకు వందశాతం జనగామ జిల్లా(Jangaon District)ను కాపాడుకునే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన అనంతరం 2022 వరకు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో కొన్నిచోట్ల పరిపాలన, జోన్లు, స్థానిక వెసులుబాటు పరంగా సమస్యలు ఉన్నాయంటూ భారీగా విజ్ఞప్తులు వచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై సమీక్ష చేస్తామని ప్రకటించింది. గతంలో విభజన అశాస్త్రీయంగా జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు ప్రకటించారు. తాజాగా శాసనసభలోనూ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ విషయంపై మరింత స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏ ప్రాతిపదికన మార్పులు, చేర్పులు చేయాలన్న దానిపై ప్రాథమిక స్థాయిలో కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. కాసేపటి క్రితం జరిగిన ప్రెస్‌మీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి కూడా జిల్లాల విభజనపై మాట్లాడి స్పష్టత ఇచ్చారు.

Next Story