కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన ఎంపీ.. దానిపై ఏం చర్యలు తీసుకున్నారని ?

by samatah |
కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన ఎంపీ.. దానిపై ఏం చర్యలు తీసుకున్నారని ?
X

దిశ, ఏపీ బ్యూరో : ప్రజా పంపిణీ కోసం చేసిన ఆహార ధాన్యాల రవాణాలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బుధవారం పార్లమెంటులో ప్రశ్నించారు. గత మూడేళ్లలో ఆహార ధాన్యాలను ఇతర ప్రయోజనాల కోసం మళ్ళించడం, లీకేజీలు, అవినీతికి సంబంధించి వచ్చిన ఫిర్యాదులు గత మూడేళ్లలో ఎన్ని నమోదయ్యాయో తెలపాలని, భవిష్యత్తులో ఇవి జరగకుండా ఎటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశారో తెలపాలని కూడా కోరారు. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర ప్రజా పంపిణీ శాఖ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆహారధాన్యాల దుర్వినియోగం జరిగిన విషయం వాస్తవమేనని అంగీకరించారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆహార ధాన్యాలను ఇతర అవసరాలకు మళ్ళించడం, రవాణాలో అవినీతి, ఇతర లీకేజీలకు సంబంధించి నష్టం జరిగిందని తెలిపారు. దీనికి సంబంధించి ఒక పటిష్టమైన వ్యవస్థను రూపొందించి అమలు పరిచేందుకు ప్రయత్నం జరుగుతోందని వివరణ ఇచ్చారు. వివిధ పథకాల కింద ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆహార ధాన్యాల రవాణా జరుగుతోందని.. దీనిపై వారు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి తెలిపారు.

Next Story