రైతులను బెంబేలెత్తిస్తున్న మోటార్ దొంగలు..!

by Batti.Sumithra |

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో మోటార్ దొంగల బెడద రోజురోజుకూ పెరుగుతోంది.

రైతులను బెంబేలెత్తిస్తున్న మోటార్ దొంగలు..!
X

దిశ, గరిడేపల్లి : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో మోటార్ దొంగల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. పంటలకు ప్రాణాధారమైన బోరు మోటార్లనే లక్ష్యంగా చేసుకున్న చోర ముఠాలు అర్ధరాత్రి వేళ పొలాల్లోకి చొరబడి, క్షణాల్లోనే మోటార్లను విప్పుకుని ఉడాయిస్తున్నాయి. వరుస చోరీలతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒకవైపు పంట సాగు చేయడానికి ఖర్చులు, మరోవైపు విద్యుత్ సమస్యలతో సతమతమవుతున్న రైతులకు ఇప్పుడు మోటార్ దొంగలు కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నారు. వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన మోటార్లు ఒక్క రాత్రిలోనే మాయమవుతుండటంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నారు.

ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు నారు పోశారు. నారుమళ్ళకు నీరందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుందేమోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా గరిడేపల్లి మండల పరిధిలోని గంగానగర్ లో గత రెండు రోజుల క్రితం బాలెం.సైదులు, నట్టే జ్యోతి, పాలెం చెన్నయ్య మైలారి సోమిరెడ్డి, సైదాబీ, కంభం అంజిరెడ్డి, నరసయ్య వంగాల సైదిరెడ్డి, కంభం రామకృష్ణారెడ్డి, వెంకట్ రెడ్డి, తిప్పన సైదమ్మ, సైదిరెడ్డిలకు సంబంధించిన 15 మోటార్స్ కేబుల్ వైర్స్ పోయాయి. గంగానగర్ గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో రాత్రి గస్తీని పెంచాలని, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మోటార్ దొంగల పై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు పోలీసులను కోరుతున్నారు.

Next Story