5 బిలియన్ డాలర్లు దాటనున్న మొబైల్‌ఫోన్ ఎగుమతులు!

by Disha Web Desk 17 |
5 బిలియన్ డాలర్లు దాటనున్న మొబైల్‌ఫోన్ ఎగుమతులు!
X

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి మొబైల్‌ఫోన్ ఎగుమతుల విలువ 75 శాతం అధిగమించి 5.5 బిలియన్ డాలర్ల(రూ. 42 వేల కోట్ల)కు చేరుకుంటాయని గురువారం ఓ నివేదిక వెల్లడించింది. 2020-21లో ఈ ఎగుమతుల విలువ 3.16 బిలియన్ డాలర్ల(రూ. 24.12 వేల కోట్లు)గా నమోదయ్యాయి. గ్లోబల్ సరఫరాలో భారత్‌ను చేర్చడంతో పాటు గ్లోబల్ ఎగుమతుల్లో భారత్ వాటాను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం 2020లో స్మార్ట్‌ఫోన్ పరిశ్రమకు పీఎల్ఐ పథకాన్ని అమలు చేయడం వల్ల పరిశ్రమ ఎగుమతులు భారీగా పెరిగేందుకు దోహదపడ్డాయని ఇండియన్‌ సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌(ఐసీఈఏ) నివేదిక అభిప్రాయపడింది. ప్రభుత్వం-పరిశ్రమ భాగస్వామ్యంతో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో గణనీయమైన పెరుగుదల నమోదైందని ఐసీఈఏ ఛైర్మన్ పంకజ్ మొహింద్రూ చెప్పారు.

2020లో కరోనాను ఎదుర్కొన్న పరిశ్రమ, 2021లోనూ కార్యకలాపాలను స్థిరంగా కొనసాగించలేకపోయింది. అయినప్పటికీ అంచనాలకు మించి ఎగుమతులు నమోదయ్యాయి. మొబైల్‌ఫోన్ ఎగుమతుల్లో పెరుగుదల మొత్తం ఎగుమతుల్లో కీలకమైన మార్పును సూచిస్తుంది. ఐదేళ్ల కాలానికి వర్తించే పీఎల్ఐ పథకంలో భాగంగా ఎంపిక చేసిన కంపెనీలు మొత్తం రూ. 10.5 లక్షల కోట్లకు పైగా విలువైన ఉత్పత్తిని నిర్వహించనున్నాయి. ఇందులో దాదాపు 60 శాతం ఎగుమతుల ద్వారా అంటే రూ. 6.5 లక్షల కోట్ల మద్దతు లభించనుందని ఐసీఈఏ తెలిపింది. అలాగే, పీఎల్ఐ అమలయ్యే కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 8 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని వెల్లడించింది.


Next Story

Most Viewed