ఆ ప్రాజెక్ట్ లేదు.. ఇక రాదు.. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు..

by Disha Web Desk 19 |
ఆ ప్రాజెక్ట్ లేదు.. ఇక రాదు.. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు..
X

దిశ, స్టేషన్ ఘన్ పూర్: లింగంపల్లి రిజర్వాయర్ లేదు.. ఇక రాదని దాని స్థానంలోనే మల్లన్న గండి నుండి లిఫ్ట్ ఏర్పాటు చేసి ఎగువన ఉన్న అన్ని గ్రామాలకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్సీ కడియం శ్రీ హరి వెల్లడించారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామంలో రూ.4 లక్షల 50 వేల వ్యయంతో బాలవికాస ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలవికాస దేశవ్యాప్తంగా చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. సమాజంలో సగభాగం ఉన్న మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలు అందిపుచ్చుకోవాలన్నారు. అందులో భాగంగానే మూడు రోజుల పాటు మహిళా బంధు కార్యక్రమం నిర్వహించి.. మహిళల్ని గౌరవించాలని ప్రత్యేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిందన్నారు. లింగంపల్లిలో రూ. 15 లక్షలతో మహిళా భవన్ నిర్మిస్తామని.. కొమ్ము గుట్ట నుండి బేబీ తండా వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తాను హామీ ఇచ్చారు.

కరోనా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రాదు లింగంపల్లి రిజర్వాయర్.. ఇక లేదని గ్రామస్తులు ఆందోళన చెందాల్సిన అవసరం అంతకన్నా లేదని శ్రీ హరి వెల్లడించారు. రిజర్వాయర్ స్థానంలో మల్లన్న గండి రిజర్వాయర్ వద్ద రూ.105 కోట్లతో లిఫ్ట్ ఏర్పాటు చేసి నర్మెట, చిల్పూర్, వేలేరు మండలాలకు త్రాగు, సాగు నీరు అందిస్తామన్నారు. ఈ నెలలో టెండర్లు ఖరారు చేసి ఏడాది కల్లా పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తామన్నారు. గ్రామ సర్పంచ్ రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ కృష్ణారెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకన్న, సిహెచ్. నరేందర్ రెడ్డి, సాగునీటి సాధన సమితి చైర్మన్ మనోజ్ రెడ్డి, మామిడాల లింగారెడ్డి, ఇల్లందుల సుదర్శన్, సారంగపాణి బాలవికాస ప్రతినిధి ప్రతాప్ రెడ్డి, బూర్ల శంకర్, సిహెచ్‌రాజ్ కుమార్, సర్పంచులు, ఎంపీటీసీలు, మహిళలు పాల్గొన్నారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి మహిళలను సత్కరించారు.



Next Story

Most Viewed