జాతీయ జెండా పట్టాలంటే భయమేస్తోంది.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు (వీడియో)

by Web Desk |
జాతీయ జెండా పట్టాలంటే భయమేస్తోంది.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు (వీడియో)
X

దిశ, జడ్చర్ల: బీజేపీ నాయకుల వల్ల 'జై శ్రీరామ్' అనడానికి, కాంగ్రెస్ నేతల వల్ల జాతీయ జెండా పట్టుకోవడానికి భయపడాల్సి వస్తున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం జడ్చర్ల మండల కేంద్రంలో నిర్మించిన రైతు వేదికను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి, ఇతర దేవాలయాలను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. అందరం హిందువులమే తేల్చి చెప్పారు. కానీ, బీజేపీ నేతలు మాత్రం తామే హిందువులం అనేవిధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 'జై శ్రీరామ్' అనే పదం వాళ్లకే సొంతం అన్నట్లు ఫీల్ అవుతున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాళ్ల వల్ల హిందువులమైన మనం 'జై శ్రీరామ్' అనడానికి భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించారు. మరోవైపు జాతీయ జెండా మాదిరి కాంగ్రెస్ నేతలు వాళ్ల పార్టీ జెండాను రూపొందించుకొని, తామే దేశభక్తులం అనేవిధంగా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ జెండా వల్ల జాతీయ జెండా చేత పట్టుకోవాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని లక్ష్మారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంతో టీఆర్ఎస్‌ లోపాయికారి ఒప్పందం చేసుకున్నదని బీజేపీ ఆరోపిస్తోందని, మరి ఓవైసీపై కాల్పులు జరిపిన తీరు ఎవరు ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నారో తెలుస్తున్నదని లక్ష్మారెడ్డి అన్నారు. కర్ణాటకలో బీజేపీ ఓటు రాజకీయాల కోసం చేసిన గొడవలు తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ వ్యాపిస్తాయో అన్న భయం కలుగుతుందని లక్ష్మారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నేతలు, అధికారులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed