ఎక్కడున్నాం అని కాదు.. ఏం చేస్తున్నాం అనేదే లెక్క: జగ్గారెడ్డి

by Disha Web Desk 2 |
ఎక్కడున్నాం అని కాదు.. ఏం చేస్తున్నాం అనేదే లెక్క: జగ్గారెడ్డి
X

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: ''టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేను కాంగ్రెస్‌లో చేరడంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్​రాజశేఖర్​రెడ్డి పిలిచి సంగారెడ్డికి ప్రతిష్టాత్మకమైన ఐఐటీ కళాశాల ఇచ్చారు. అప్పటికప్పడు కంది సమీపంలో రైతులతో చర్చించి 500 ఎకరాలు సేకరించా. నేనెప్పుడు అభివృద్ధిని కోరుకుంటా. నేను తీసుకొచ్చిన ఐఐటీని చూపించి ఇప్పుడు ప్రతిపక్షాలు ఐఐటీకి 50 కిలోమీటర్ల మేర రియల్-దందా చేసుకుంటున్నారు'' అని కాంగ్రెస్​నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సతీమణి నిర్మల, కూతురు జయారెడ్డి, కుమారుడు భరత్​ సాయిరెడ్డిలతో కలిసి జగ్గారెడ్డి ఐఐటీ డైరెక్టర్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఐఐటీలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఐఐటీ ప్రాంగణంలోని డీఏవీ స్కూల్లో ప్రత్యేకంగా సీట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత వరకు కృషి చేస్తామని డైరెక్టర్​బీఎస్​మూర్తి జగ్గారెడ్డికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో సోనియాగాంధీ 2008లో రాష్ట్రానికి ఐఐటీ మంజూరు చేశారని అన్నారు.


ఆ సమయంలో తాను టీఆర్ఎస్‌లో ఉన్నానని, నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌లో చేయడంతో అసెంబ్లీ సమావేశాల సమయంలో సీఎం రాజశేఖర్ రెడ్డి స్వయంగా పిలిచి సంగారెడ్డికి ఐఐటీ ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. తమ ప్రాంతానికే ఐఐటీ ఇవ్వాలని అప్పటి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ముఖేష్ గౌడ్, దానం నాగేందర్ సీఎం వెంటపడ్డారని తెలిపారు. అయినా, వైఎస్​మాత్రం తాను నియోజకవర్గ అభివృద్ధికి కాంక్షించి కాంగ్రెస్‌లో చేరిన కారణంగా ఐఐటీని సంగారెడ్డికి ఇచ్చారని చెప్పారు. సీఎం చెప్పగానే 500 ఎకరాల భూమిని కంది మండలంలో జాతీయ రహదారి పక్కన సేకరించామని గుర్తుచేశారు. ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో ఎకరా భూమి రూ.5 లక్షలు పలికింది. ఐఐటీ మంజూరు కావడం, సోనియాగాంధీ, రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న భూముల ధరలకు రెక్కలొచ్చినట్లు జగ్గారెడ్డి చెప్పారు. ఐఐటీ చుట్టుపక్కల 50 కిలోమీటర్లు మేర భూమి విలువ పెరిగిందన్నారు. అప్పుడు తాను సంగారెడ్డికి తీసుకొచ్చిన ఐఐటీని చూపించుకుని, ఇప్పుడు తనను రోజూ తిట్టిపోసే ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా రియల్ వ్యాపారం చేసుకుంటున్నారని జగ్గారెడ్డి విమర్శించారు.

స్థానికులకు ఉద్యోగ అవకాశాల కల్పనకు కృషి

నియోజకవర్గ అభివృద్ధి కోసం సంగారెడ్డికి ఐఐటీ తీసుకొచ్చానని చెప్పిన జగ్గారెడ్డి ఐఐటీలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ఇందులోని డీఏవీ స్కూల్లో సీట్లు కేటాయించాలని డైరెక్టర్‌ను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఆరోజులో ఎకరం భూమి ఇచ్చిన రైతులకు 200 గజాల ప్లాట్లు ఇచ్చినట్లు జగ్గారెడ్డి గుర్తుచేశారు. అయితే, ఐఐటీలో మొక్కలకు నీళ్లు పోసే ఉద్యోగాలు మొదలుకుని ఎలాంటి పనైనా స్థానికులకు అవకాశం కల్పించాలని డైరెక్టర్‌ను కోరారు. స్థానికులకు మంచి జరుగుతుందని తాను ఐఐటీని సంగారెడ్డికి తీసుకువచ్చానని అన్నారు. క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఐఏవీలో ఐఐటీకి భూములిచ్చిన పిల్లలకు సీట్లు ఇవ్వాలని జగ్గారెడ్డి కోరారు. కళాశాలలో 50శాతం పనులు పూర్తి అయ్యాయని మరో 5‌‌0 శాతం కావాల్సి ఉన్నదని డైరెక్టర్​బీఎస్​మూర్తి జగ్గారెడ్డికి వివరించారు.

ప్రాజెక్ట్ పూర్తయితే సాధ్యమైనంత వరకు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, డీఏవీ స్కూల్లో కూడా స్థానికులకు అడ్మిషన్లు ఇవ్వడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే స్థానికులు ఉద్యోగ అవకాశాలు, తమ పిల్లలకు స్కూలులో సీట్ల కోసం సంగారెడ్డి రామమందిరం వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద ధరఖాస్తులు అందించాలని జగ్గారెడ్డి సూచించారు. కేవలం నియోజకవర్గ పరిధిలోని వారు మాత్రమే ధరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ''జగ్గారెడ్డి పని ఇలా ఉంటుంది. ఇదే అంశాన్ని ప్రజలు గమనించాలి. జగ్గారెడ్డి అక్కడ ఉంటాడా..! ఇక్కడ ఉంటాడా..! వాడిని తిడుతాడా.. వీడిని తిడుతాడా..! అనేది అక్కరలేదు. రాజకీయ పంచాయతీలు పక్కన పెట్టి మంచి చేస్తున్నాడా.. లేదా..? అనేది గుర్తించాలి'' అని జగ్గారెడ్డి కోరారు.



Next Story

Most Viewed