Etela Rajender: గవర్నర్‌ పట్ల కేసీఆర్ సైకోలాగా ప్రవర్తిస్తున్నాడు.. ఈటల సీరియస్

by Disha Web Desk 2 |
Etela Rajender: గవర్నర్‌ పట్ల కేసీఆర్ సైకోలాగా ప్రవర్తిస్తున్నాడు.. ఈటల సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీరియస్ కామెంట్స్ చేశారు. వరిధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలకు నిరసనగా సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీకు అధికారం ఇచ్చింది ఎందుకు.. చేతకాని దద్దమ్మల్లాగా రాష్ట్రాన్ని వదిలి వెళ్లి ఢిల్లీలో ధర్నా చేయడానికా? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న పార్టీకి ప్రజల బాధలు చెప్పేందుకు ప్రతిపక్ష పార్టీలకు హక్కు ఉంటుంది.. కానీ, అధికారంలో ఉన్న కేసీఆర్ ధర్నా చేసి రైతులకు ఏం చెబుతున్నారని అన్నారు.

హుజురాబాద్ ఎన్నికల తర్వాతే కేసీఆర్‌కు ఈ పూనకం వచ్చిందని, మైండ్ బ్లాంక్ అయ్యి ఏం చేయాలో అర్థంకాక నాటకాలు ఆడుతున్నాడని ఎద్దేవా చేశారు. పీకే వచ్చి, కేసీఆర్ పని ఖతం అని చెప్పగానే.. కొత్త నాటకానికి తెరలేపాడని అన్నారు. కూట్ల రాయి తీయలేనోడు.. ఏట్లో రాయి తీస్తాడన్నట్లుంది కేసీఆర్ తీరు అని మండిపడ్డారు. భూకంపం సృష్టించే శక్తి ఉన్న కేసీఆర్‌కు మెడ మీద కత్తి పెట్టి ఒప్పంద పత్రం రాయించుకున్నారని ఎలా చెబుతున్నావని ప్రశ్నించారు. అంత శక్తివంతుడవైన నీకు కత్తి పెట్టే ధైర్యం ఉందా? అంటూ సెటైర్లు వేశారు. ఢిల్లీ నుంచి వెంటనే వచ్చి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్‌పై ఇంత కక్ష ఎందుకు.. సమ్మక్క జాతరలో, యాదాద్రి పర్యటన, భద్రాద్రి ఆయంలో ఇలా ఎన్నిచోట్ల అవమానిస్తారని అడిగారు. కేసీఆర్ తానే చక్రవర్తి లాగా ఉండాలని సైకోలాగా ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed