మిర్యాలగూడలో ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బీఎల్‌ఆర్

by Batti.Sumithra |

మిర్యాలగూడ మండలంలోని వెంకటాద్రిపాలెం, తుంగపాడు గ్రామాలతో పాటు దామరచర్ల మండలం కొండ్రపోల్ గ్రామంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్‌ఆర్) గురువారం ప్రత్యక్షంగా పరిశీలించారు.

మిర్యాలగూడలో ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బీఎల్‌ఆర్
X

దిశ, మిర్యాలగూడ రూరల్ : మిర్యాలగూడ మండలంలోని వెంకటాద్రిపాలెం, తుంగపాడు గ్రామాలతో పాటు దామరచర్ల మండలం కొండ్రపోల్ గ్రామంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్‌ఆర్) గురువారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ బూత్‌లను సందర్శించిన ఎమ్మెల్యే ఓటరు నమోదు, వివరాల సవరణ, కొత్త దరఖాస్తుల స్వీకరణ, అవసరమైన ధ్రువపత్రాల పరిశీలన తదితర ప్రక్రియలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులోపు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

బూత్ లెవల్ అధికారులతో (బీఎల్‌ఓలు) మాట్లాడిన ఎమ్మెల్యే, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని, ప్రతి అర్హుడైన ఓటరికి న్యాయం జరిగేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలకు అవసరమైన అవగాహన కల్పిస్తూ, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని తెలిపారు. అదేవిధంగా, బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) కూడా పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తూ, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని, ఓటరు జాబితా సవరణ కార్యక్రమం విజయవంతం కావడానికి అధికారులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓటరు జాబితా ఎన్నికల ప్రక్రియకు అత్యంత కీలకమైనదని, ప్రతి అర్హుడి పేరు జాబితాలో నమోదయ్యేలా అధికారులు, బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్‌ఆర్) పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు, బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Next Story