రేవంత్ రెడ్డి బీజేపీకి సీక్రెట్ ఏజెంట్.. బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
రేవంత్ రెడ్డి బీజేపీకి సీక్రెట్ ఏజెంట్.. బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ప్రభుత్వ విప్, చెన్నూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నేతలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్టు మాట్లాడాటాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. రాహుల్‌ గాంధీకి తెలుగు రాకున్నా.. తెలుగులో ట్వీట్లు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు కడుతుంటే కేసులు వేసింది కాంగ్రెస్ నేతలే అని మండిపడ్డారు. ధాన్యం సేకరణపై బీజేపీ విధానానికి కాంగ్రెస్ పరోక్షంగా మద్దతు ఇస్తోందని, బీజేపీకి రేవంత్ ఔట్ సోర్సింగ్ ఏజెంట్‌గా మారిపోయాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో ఎంపీగా బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని రేవంత్ రెడ్డి, మమ్మల్ని అడుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను రేవంత్ రెడ్డి గందర గోళానికి గురిచేస్తున్నాడని అన్నారు. సోనియాను బలిదేవత అన్న రేవంత్ రెడ్డి, ఇవాళ తెలంగాణ దేవత అంటున్నాడని గుర్తుచేశారు.

పెయింటర్ రెడ్డి నుంచి రేవంత్ పెయిడ్ రెడ్డి‌గా మారారని, రేవంత్‌ది అంతా నకిలీ-మకిలీ చరిత్రే అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు చెప్పులు మోశాడు.. ఇపుడు బీజేపీ ఏజెంట్‌గా మారాడు, వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని హోల్‌సేల్‌గా బీజేపీకి తాకట్టు పెడతాడని వ్యాఖ్యానించారు. రేవంత్ బారినుండి కాంగ్రెస్‌ను కాపాడుకోవడంపై రాహుల్ గాంధీ దృష్టి సారించాలని సూచించారు. మంత్రి కేటీఆర్ ఏడు రోజుల పాటు అమెరికాలో పర్యటించి రాష్ట్రానికి పెట్టుబడులు సాధించారని అన్నారు. కేటీఆర్ గ్లోబల్ లీడర్ అని, రేవంత్ రెడ్డి కేటీఆర్ కాలి గోటికి కూడా సరిపోరని అన్నారు. తెలంగాణ ప్రజలు రేవంత్ తీరును సహించరని, పద్ధతి మార్చుకోకుంటే తీవ్రపరిణామాలు తప్పవని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఉగాది తర్వాత నుంచి బీజేపీ భరతం పడతామని అన్నారు.

Next Story

Most Viewed