రూ.800 కోట్ల ప్రజా ధనాన్ని కాపాడండి.. గవర్నర్‌కు లేఖ!

by Disha Web Desk 2 |
రూ.800 కోట్ల ప్రజా ధనాన్ని కాపాడండి.. గవర్నర్‌కు లేఖ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామ, మున్సిపాలిటీల్లో సీడీపీ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నదని, సీడీపీని నిలిపివేసి రూ. 800 కోట్లను కాపాడాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం పద్మనాభరెడ్డి గవర్నర్‌ను తమిళి సై సౌందర రాజన్‌ను కోరారు. ఈ మేరకు గురువారం ఆమెకు లేఖను అందజేశారు. రాజ్యాంగంలోని అనుకరణ 243 జీ, 243 డబ్ల్యూ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు అధికారం బదలాయింపు జరగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం. 130తో నియోజకవర్గ అభివృద్ధి పేరు నిధులు కేటాయించి రాజ్యాంగ విరుద్ధంగా సీడీపీ ద్వారా పనులు చేయిస్తున్నదన్నారు. కొత్తగా జారీ చేసిన విధివిధానాల్లో అడిట్ విషయంలో స్పష్టత లేదని, ఆడిట్ లో ఏవైనా తప్పులు ఉన్నా కలెక్టర్ సరిచేస్తారని మాత్రమే ఉందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పని విలువ రూ. 5 లక్షల లోపు ఉంటే ఆ పనిని నామినేషన్ ద్వారా చేయవచ్చనే ఆదేశాలు ఉన్నాయని, దీనిని సాకుగా తీసుకొని పెద్ద పనులు కూడా ముక్కలుగా విడగొట్టి చిన్న చిన్న బిట్లుగా చేసి నామినేషన్‌పై ఎమ్మెల్యేల అనుయాయులకు ఇస్తున్నారన్నారు. పనులు సరిగ్గా జరగక ప్రజాధనం వృథా అవుతుందని ఆరోపించారు. పనులు నాణ్యతతో చేపట్టేలా చర్యలు తీసుకొని డబ్బు వృథాకాకుండా చర్యలు చేపట్టలని గవర్నర్‌ను కోరారు.



Next Story

Most Viewed