క్యాతనపల్లి మున్సిపాలిటీలో మంత్రి వివేక్‌ మార్నింగ్‌ వాక్‌..

by Batti.Sumithra |

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర కార్మిక, ఉపాధి గనుల శాఖ మంత్రి సోమవారం ఉదయం 9వ వార్డులో స్థానిక నాయకులతో కలిసి మార్నింగ్‌వాక్‌ నిర్వహించారు.

క్యాతనపల్లి మున్సిపాలిటీలో మంత్రి వివేక్‌ మార్నింగ్‌ వాక్‌..
X

దిశ, రామకృష్ణాపూర్ : క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర కార్మిక, ఉపాధి గనుల శాఖ మంత్రి సోమవారం ఉదయం 9వ వార్డులో స్థానిక నాయకులతో కలిసి మార్నింగ్‌వాక్‌ నిర్వహించారు. ఆయన అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గతంలో ఇచ్చిన హామీల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ 9వ వార్డులోనే రూ.4.80 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రాబోయే మూడు నెలల్లో ఈ పనులు వంద శాతం పూర్తవుతాయని భరోసా ఇచ్చారు. గత పాలకుల నిర్లక్ష్యం, బిల్డర్ల బాధ్యతారాహిత్యం కారణంగా కాలనీల్లో రోడ్లు, డ్రైన్లు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాతనపల్లి మున్సిపాలిటీ పై ప్రత్యేక దృష్టి సారించి సుమారు రూ.80 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిందని తెలిపారు.

ఈ ఏడాది అమృత్‌ పథకం కింద రూ.40 కోట్లతో తాగునీటి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, డిసెంబరు నాటికి ప్రతి ఇంటికీ నల్లా ద్వారా తాగునీరు అందించే బాధ్యతను కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకుంటుందని పేర్కొన్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించిన బీఆర్‌ఎస్‌ నాయకుడు కేటీఆర్‌ వ్యాఖ్యల పై స్పందించిన మంత్రి, 60 వేల మందితో ముట్టడి చేసి పంపులు నడుపుతామనడం అవగాహన లేమికి నిదర్శనమని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్ని టీఎంసీల నీటిని వినియోగించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలోమండల తహసీల్దార్ పి.సతీష్ కుమార్, మున్సిపాలిటీ కమిషనర్ మారుతి ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు వోడ్నాల శ్రీనివాస్, గద్దెరాగిడి కౌన్సిలర్ భీమా మల్లేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Next Story