ఎస్ఐఆర్ ఓటరు సవరణ ప్రక్రియను పరిశీలించిన మంత్రి పొన్నం

by Ratna Kumari |

కోహెడ మండల కేంద్రంలో ఇంటింటికీ జరుగుతున్న ఎస్ఐఆర్ (ప్రత్యేక సమగ్ర సవరణ) ఓటరు సవరణ ప్రక్రియను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు.

ఎస్ఐఆర్ ఓటరు సవరణ ప్రక్రియను పరిశీలించిన మంత్రి పొన్నం
X

దిశ, కోహెడ : కోహెడ మండల కేంద్రంలో ఇంటింటికీ జరుగుతున్న ఎస్ఐఆర్ (ప్రత్యేక సమగ్ర సవరణ) ఓటరు సవరణ ప్రక్రియను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్‌ఓలు, బూత్ స్థాయి సిబ్బందితో మాట్లాడి ప్రక్రియపై ఆరా తీశారు. అనంతరం స్వయంగా ప్రజలకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 2002-2025 ఓటరు జాబితా ఆధారంగా ఎన్యూమరేషన్ ఫారాలను అందించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల సవరణ ప్రక్రియ కొనసాగుతోందని, బీఎల్‌ఓలు అందజేసే ఎన్యూమరేషన్ ఫారాలను ప్రతి ఓటరు తప్పనిసరిగా నింపాలని తెలిపారు.

ఓటర్ల జాబితాలో పేరు గల్లంతు కాకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 2002-2025 ఓటరు జాబితా ప్రకారం హుస్నాబాద్ నియోజకవర్గంలో సుమారు 60 వేల ఓట్లు తటస్థంగా ఉన్నాయని, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటి ఓట్లు తటస్థంగా ఉన్నాయని తెలిపారు. అయితే తటస్థంగా ఉండటం వల్ల ఓట్లు తొలగిపోయినట్లుకాదని, సంబంధిత ఫారాలను నింపి అవసరమైన ఆధారాలను సమర్పించడం ద్వారా ఓటు హక్కును కాపాడుకోవచ్చన్నారు. జూలై 31న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల కానుందని, అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా బీఎల్‌ఏలు, బీఎల్‌ఓలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైన ఆయుధమని, ఒక్క ఓటు కూడా కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. అలాగే ఓటరు సవరణ ప్రక్రియపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం కోహెడ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.

Next Story