అనకాపల్లి లో మంత్రి నారా లోకేష్ పర్యటన.. రూ. 2000 కోట్ల పెట్టుబడితో 'బ్లూజెట్ హెల్త్‌కేర్'కు శంకుస్థాపన

by Malleboina Mahesh |

మంత్రి నారా లోకేష్ నేడు అనకాపల్లి జిల్లా సీతపాలెంలో బ్లూజెట్ హెల్త్‌కేర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం రూ. 10 కోట్ల నిధిని సేకరించి చిన్నారి ప్రాణం కాపాడిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ను అభినందించనున్నారు.

అనకాపల్లి లో మంత్రి నారా లోకేష్ పర్యటన.. రూ. 2000 కోట్ల పెట్టుబడితో బ్లూజెట్ హెల్త్‌కేర్కు శంకుస్థాపన
X

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ సమావేశాలు మార్చి 4 కు వాయిదా పడటంతో మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు అనకాపల్లిలో ఆయన పర్యటించనున్నారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి లో భాగంగా మంత్రి నారా లోకేష్ ఈ రోజు ఉదయం 10:30 గంటలకు రాంబిల్లి మండలం సీతపాలెం వద్ద బ్లూ జెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ (Blue Jet Healthcare Private Limited) సంస్థకు శంకుస్థాపన చేస్తారు. సుమారు రూ. 2000 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ సంస్థ ద్వారా దాదాపు 1700 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌తో ప్రత్యేక భేటీ..

పారిశ్రామిక కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 12:20 గంటలకు సీతపాలెం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై ఒక ప్రత్యేక సమావేశం జరగనుంది. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి పునర్విక చికిత్స కోసం సోషల్ మీడియా వేదికగా స్పందించి, సుమారు రూ. 10 కోట్లు వసూలు చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్‌ను మంత్రి లోకేష్ ఈ సందర్భంగా కలిసి అభినందించనున్నారు. మానవత్వంతో చేసిన ఈ గొప్ప ప్రయత్నాన్ని కొనియాడేందుకు మంత్రి స్వయంగా ఈ భేటీని ఏర్పాటు చేసుకున్నారు.

Next Story