ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన హరీష్ రావు

by Dishanational1 |
ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన హరీష్ రావు
X

దిశ, కాగజ్ నగర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో నెల రోజుల్లో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రకటించారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిర్వహిస్తున్న ఉచిత నిత్యాన్నదాన సత్రాన్ని శుక్రవారం అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డితో కలిసి సందర్శించారు. ఎమ్మెల్యే కోనప్ప సిర్పూర్ నియోజకవర్గంలో డయాలసిస్ సెంటర్ లేకపోవడంతో కిడ్నీ, మూత్రపిండాలు, తలసేమియా తదితర వ్యాధిగ్రస్తులు ఇబ్బంది పడుతున్నారని మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకువచ్చారు. సిర్పూర్ నియోజకవర్గంలో చాలా మంది పేద ప్రజలు ఉన్నారని, వారికి డయాలసిస్ సెంటర్ అందుబాటులో లేకపోవడంతో కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ లాంటి సుదూర నగరాలకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా కోనప్ప నిర్వహిస్తున్న నిత్యాన్న సత్రం రాష్ట్రంలో ఎమ్మెల్యేలందరికీ ఆదర్శంగా నిలుస్తుంది కొనియాడారు. ఎమ్మెల్యే కోనప్ప చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు పేదలకు చేయుత అందిస్తున్నాయని ప్రశంసించారు. మంత్రి హరీష్ రావ్ వెంట కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ రావు, మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, వ్యవసాయ మార్కెట్ కమిటీచైర్మన్ కాసం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు... మంత్రి హరీష్ రావు!

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి హరీష్ రావు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. సమస్యలు మంత్రికి విన్నవిస్తామని పలువురు ఉద్యోగులు, కుల సంఘాల నాయకులు గంటల తరబడి మంత్రి రాక కోసం ఎదురు చూశారు. మంత్రి హరీష్ రావు సత్రంలో భోజనం చేశాక హడావిడిగా కొద్దిమంది నుండి వినతులు స్వీకరించారు. తమ సమస్యల్ని మంత్రి గారికి వివరిస్తామని వారు ప్రయత్నించినప్పటికీ మంత్రి వినే మూడ్ లో లేకపోయారని పలువురు వాపోయారు. వినతి పత్రాలు అందజేసినవారిలో మాలి సంఘం నాయకులు, ఏఎన్ఎంలు, గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు, సీఆర్ టీ లు తదితరులు ఉన్నారు.


Next Story