రాబోయే రోజుల్లో ఆన్‌లైన్‌లో మందులు: మంత్రి హరీష్ రావు

by Disha Web Desk 19 |
రాబోయే రోజుల్లో ఆన్‌లైన్‌లో మందులు: మంత్రి హరీష్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా, దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టేందుకు సీఎం కేసీఆర్ సారథ్యంలో పనిచేయాలని వైద్య ఆరోగ్యశాఖమంత్రి తన్నీరు హరీష్ రావు అధికారులకు సూచించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని టీఎస్ పార్డ్‌లో 33 జిల్లాల వైద్య ఆరోగ్య అధికారులు, ఉద్యోగులతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో మందులను ఆన్‌లైన్ చేస్తామన్నారు.

100 శాతం వ్యాక్సినేషన్ దిశగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. 12 - 14 లోపు చిన్నారులకు కొవిడ్ టీకా వేసేందుకు తల్లిదండ్రులును సైతం భాగస్వామ్యం చేయాలన్నారు. అందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి వారం రోజుల్లో పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నెలా ఒకరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులతో రివ్యూ మీటింగ్ పెడతామన్నారు. ప్రతి ఒక్కరు పని భారంగా భావించకుండా, బాధ్యతగా ప్రజాసేవ చేయాలన్నారు. ఆరోగ్య శాఖపై సీఎం సుముఖంగా ఉన్నారన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు, ఉద్యోగులకు నగదు పురస్కారాలు ఇచ్చి గౌరవిస్తామని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీలు లేకుండా భర్తీ చేసుకోవాలని ఆదేశించారు. టీబీ, మలేరియాలో పురోగతి సాధించాలన్నారు. గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. దానిపై గర్భిణీ స్త్రీకి అంగన్ వాడీ సిబ్బంది, ఏఎన్‌ఎం‌లు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వి, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed