అన్ని మోడళ్లపై 3 శాతం ధరలు పెంచిన మెర్సిడెస్ బెంజ్!

by Disha Web Desk 17 |
అన్ని మోడళ్లపై 3 శాతం ధరలు పెంచిన మెర్సిడెస్ బెంజ్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ లగ్జరీ వాహనాల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఏప్రిల్ 1 నుంచి తన మొత్తం అన్ని మోడళ్లపై ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇన్‌పుట్ ఖర్చులు భారం కావడంతో పాటు లాజిస్టిక్ ఖర్చులు భారీగా పెరగడంతో మొత్తం వ్యయంపై ఒత్తిడి పెరిగిందని కంపెనీ పేర్కొంది. దీంతో వచ్చే నెల నుంచి అన్ని మోడళ్లపై 3 శాతం వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీన్ని బట్టి కారు మోడల్‌ని బట్టి ధరలు రూ. 50,000 నుంచి రూ. 5 లక్షల వరకు పెరగనున్నాయి.

గత కొంతకాలంగా వాహనాల తయారీలో ఇన్‌పుట్ ఖర్చులు అధికంగా మారడంతో నిర్వహణ వ్యయంలో గణనీయమైన మార్పులు జరిగాయి. అయితే, స్థిరమైన, మెరుగైన వ్యాపార నిర్వహణ కోసం అన్ని రకాల కార్లపై ధరలను పెంచక తప్పటం లేదని కంపెనీ వివరించింది. కంపెనీ వినియోగదారులకు అందించే నాణ్యమైన ఉత్పత్తితో పాటు అత్యాధునిక టెక్నాలజీని ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటాం. కానీ ఇటీవల పరిణామాల్లో అన్ని రకాల ఖర్చులు పెరగడం వల్లనే రిటైల్ ధరలను పెంచాల్సి వచ్చిందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ మార్టిన్ ష్వెంక్ అన్నారు. కాగా, ఈ నెల ప్రారంభంలో మరో లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి ఇండియా కూడా తన మోడళ్లపై 1-3 శాతం మధ్య ధరలు పెంచిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed