డాక్టర్ల దందా.. సర్కారీ దవాఖాన్లలో మారని పంథా

by Disha Web Desk |
డాక్టర్ల దందా.. సర్కారీ దవాఖాన్లలో మారని పంథా
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆరోగ్యశాఖకు మంత్రులు మారుతున్న ''మందుల గోస ''మాత్రం తీరడం లేదు. సర్కారీ దవాఖాన్లలో పేషెంట్లకు కావాల్సిన మందులన్నీ లభించడం లేదు. డాక్టర్ రాసిచ్చిన చిట్టిలో కేవలం కొన్ని మాత్రమే ప్రభుత్వ ఫార్మసీల్లో ఇస్తూ.. మిగిలినవి ప్రైవేట్‌లో తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా స్వయంగా డాక్టర్లే చెబుతుండటంతో చేసేదేమీ లేక చాలా మంది పేషెంట్లు ఆసుపత్రి ఆవరణలోని ఉండే షాపులల్లో మందులు కొనుగోలు చేస్తున్నారు.

అయితే గతంతో పోల్చితే ప్రస్తుతం ప్రైవేట్​ రిఫరల్స్​ కాస్త తగ్గాయి. గతంలో ప్రతీ పది మందిలో 9 మందికి బయట కొనుగోలు చేయాలని పంపుతుండగా, ఇప్పుడు కేవలం నలుగైదు మందిని మాత్రమే పంపుతున్నారు. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, పేట్ల బురుజు, కోఠి మెటర్నరీ ఆసుపత్రుల్లో మరింత దారుణమైన పరిస్థితులున్నాయి. పేషెంట్లకు మందుల కొనుగోళ్ల కోసం ఎట్టి పరిస్థితుల్లో బయటకు పంపవద్దని మంత్రి హరీష్​రావు పలుమార్లు ఉన్నతాధికారులకు, ఆసుపత్రి హెచ్ఓడీలకు ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ ఫార్మసీల్లో అందుబాటులో లేని మందులను స్పెషల్​ ఫండ్​ నుంచి స్వయంగా ఆసుపత్రి అధికారులే కొనుగోలు చేసేలా అవకాశం ఇచ్చారు. కానీ ఇదేక్కడ అమలు కావడం లేదు. హైదరాబాద్​తో పాటు జిల్లా ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నది. ప్రస్తుతం ఉన్న విధానంలోనే పేదలకు సకాలంలో మందులు ఇవ్వలేని పరిస్థితి ఉండగా, అన్ని సర్కార్​ దవాఖాన్లలో ఆన్​లైన్​ విధానంలో మందులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్లాన్​చేయడం విచిత్రంగా ఉన్నది.

డాక్టర్లకు తెలియదా?

తమ వద్దకు వచ్చే పేషెంట్లకు ఎలాంటి మందులు రాయాలి? ఏవీ త్వరగా నయం చేయగలవు. అనేది డాక్టర్లకు స్పష్టంగా తెలుసు. దీని బట్టి ఫార్మసీల్లో స్టాక్​ పెట్టాలని ఆసుపత్రి అధికారులకు సూచించవచ్చు. కానీ కొందరు డాక్టర్లు ఫార్మసీల్లో లేని మందులు రాస్తూ మెడికల్​ షాపుల పేర్లను కూడా పేషెంట్లకు చెప్పడం గమనార్హం.

పేదలపై ఆర్థిక భారం...

ప్రభుత్వాసుపత్రులకు వచ్చే పేద పేషెంట్లు ప్రైవేట్​మెడికల్ షాపుల్లో మందులు కొనుగోలు చేయాలంటే ఆర్థిక భారం పడుతున్నది. దీంతో పాటు కొన్ని ఆసుపత్రుల్లో టెస్టుల భారం కూడా పెరిగింది. ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా చేయాల్సిన టెస్టులను పెయిడ్​గా మార్చేశారు. కోఠి ఈఎన్​టీ, చెస్ట్, సుల్తాన్​ బజార్ మెటర్నటీ, నిలోఫర్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉన్నది. హెచ్ఐవీ, సిటీ, ఎక్స్​ రే తదితర టెస్టులన్నీ బయటకే రిఫర్​ చేయడం గమనార్హం. స్వయంగా ఆసుపత్రులకు ఏజెంట్లు వచ్చి శాంపిళ్లు తీసుకొని వెళ్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

దీంతో ప్రభుత్వాసుపత్రుల్లో ఉచిత వైద్యం అందుతుందనే భరోసాతో వచ్చే పేషెంట్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అన్ని ఫ్రీ గా అందిస్తామని పదే పదే చెబుతున్న సర్కార్ దవాఖానాల్లో టెస్టులు, మందులు దోపిడీ ఎక్కువైదంటున్నారు. ఒకవైపు రూపాయి ఖర్చు లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ అందిస్తున్నామంటూనే, మరోవైపు మందులు, టెస్టులు పేరిట పేషెంట్ల జేబులు గుల్ల చేస్తున్నారు. కొందరు డాక్టర్లు ప్రైవేట్ వ్యక్తులతో చేతులు కలిపి చేస్తున్న వ్యవహారమంతా ఉన్నతాధికారులకు తెలిసినా పట్టించుకునే వారు కరవయ్యారు. ఎవరి కమీషన్లు వారికి వెళ్తే, తమను ఎవరు ఇబ్బంది పెడతారంటూ గాంధీ ఆసుపత్రిలోని ఓ మెడికల్ షాపు నిర్వహుకుడు విస్తుపోయే విషయాన్ని తెలిపారు.

డాక్టర్​ రాసిన మందుల్లో కొన్నే ఇచ్చారు : రాజేశ్,​ వర్ధనపేట​

నరాలు, వెన్నెముక నొప్పి సమస్యతో గాంధీకి వచ్చాను. డాక్టర్​పరిశీలన తర్వాత కొన్ని రకాల మందులు రాసిచ్చారు. దాదాపు పది రకాలు రాస్తే కేవలం మూడు మాత్రమే ఇచ్చారు. మిగిలినవన్నీ ప్రైవేట్​ షాపులో తీసుకోవాలని సూచించారు. దాదాపు మూడు వేలకు పైగా అవుతాయన్నారు. ప్రభుత్వంలో ప్రీగా ఇస్తారనే వరంగల్​ జిల్లా నుంచి హైదరాబాద్‌కు వచ్చాను. ప్రభుత్వాసుపత్రుల్లో దారుణమైన పరిస్థితులున్నాయి.

అగ్గువవి ఇస్తున్రు.. కాస్ట్​లీ మందులు లేవంటున్రు : సదానందగౌడ్​, సదాశివపేట్​

ప్రభుత్వ ఫార్మసీల్లో అగ్గువ ధరలున్న మందులు ఇస్తున్నారు. కాస్ట్​ఎక్కువ ఉన్నవి ఆసుపత్రిలోనే ఉన్నా ఇవ్వడం లేదు. ఓపీ ముందు ప్రైవేట్​మెడికల్​షాపుల్లో కొనుక్కోవాలని సూచించారు. ఉన్న వాటిని ఇవ్వాలని అడిగితే అవి శాంపిళ్లు మాత్రమే అని దాటవేశారు. మంత్రి హరీష్​రావు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. లేదంటే పేదల నెత్తి మీద పెనుభారం వెంటాడుతూనే ఉంటుంది.

Next Story

Most Viewed