బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి

by Ratna Kumari |

పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు.

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి
X

దిశ, పెగడపల్లి : పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం పెగడపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆయన సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని వివిధ విభాగాలు, రికార్డులు, రిజిస్టర్లు, జనరల్ డైరీ, స్టోర్‌రూమ్, లాకప్ రూమ్‌లను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను సమీక్షించి, విచారణలో ఉన్న కేసుల పురోగతిపై అధికారులతో చర్చించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, పోలీసులు తమ విధుల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని, పోలీస్ స్టేషన్‌లో **5ఎస్ విధానాన్ని** సమర్థంగా అమలు చేయాలని సూచించారు. అలాగే పోలీస్ శాఖ వినియోగిస్తున్న ఆధునిక సాంకేతికతపై ప్రతి సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని, సిబ్బందికి ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, విధుల్లో క్రమశిక్షణ పాటించాలని ఆదేశించారు. తనిఖీల అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి, పచ్చదనం–పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిబ్బందికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, సీఐ రాజ్‌కుమార్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సై కిరణ్ కుమార్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story