బీహెచ్ఈఎల్ పోస్ట్ ఆఫీస్‌లో భారీ చోరీ!

by Web Desk |
బీహెచ్ఈఎల్ పోస్ట్ ఆఫీస్‌లో భారీ చోరీ!
X

దిశ, పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని బీహెచ్ఈఎల్ పోస్టాఫీసులో ఆదివారం భారీ దొంగతనం చోటుచేసుకుంది. నిత్యం రద్దీగా ఉండటంతో పాటు బీహెచ్ఈఎల్ కు సంబంధించిన సెక్యూరిటీ నిరంతరం పెట్రోలింగ్ చేస్తున్న తరుణంలో దొంగలు గుట్టుచప్పుడు కాకుండా నగదును అపహరించుకు పోవడమే కాకుండా పోస్ట్ ఆఫీస్ కు నిప్పు పెట్టి పారిపోయారు.



పోస్ట్ ఆఫీసులోని స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగల గొట్టి అందులోని రూ. 33 లక్షల రూపాయలు నగదును ఎత్తుకెళ్లారు. పోస్ట్ ఆఫీస్ అధికారులు, పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం.. ఆదివారం సెలవు దినం కావడంతో పోస్ట్ ఆఫీస్ మూసివేసి ఉన్నది. కాగా గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం ఉదయం సమయంలో పోస్ట్ ఆఫీస్ లోకి చొరబడి లాకర్ ను పగలగొట్టి అందులో ఉన్న రూ.33 లక్షలు తీసుకొని పారిపోయారు.



అంతటితో ఆగకుండా ఆ దుండగులు దొంగతనం జరిగిందన్న అనుమానం రాకుండా ఉండేందుకు కోసం పోస్ట్ ఆఫీస్ కు నిప్పు పెట్టి వెళ్లిపోయారు. ఎవరైనా చూసినా షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందని భావించేలా దుండగులు పథకం పన్నారు. విషయాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. వారు పోస్ట్ ఆఫీస్ వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

సమాచారాన్ని అందుకున్న రామచంద్రాపురం పోలీసులు బీహెచ్ఈఎల్ లోని పోస్ట్ ఆఫీస్ కు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మియాపూర్ ఏసిపి కృష్ణ ప్రసాద్, బీహెచ్ఈఎల్ పోస్ట్ ఆఫీస్ ను సందర్శించి దొంగతనం ఏ విధంగా జరిగి ఉండవచ్చనే విషయాన్ని రామచంద్రపురం పోలీసులతో చర్చించారు. దీంతో క్లూస్ టీం ని పిలిపించి ఆధారాలను సేకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed