బొగ్గు గనిలో భారీ పేలుడు.. 25 కు చేరిన మృతుల సంఖ్య

by Malleboina Mahesh |

ఫిబ్రవరి 5న మేఘాలయలోని ఈస్ట్ జైంతియా హిల్స్ జిల్లాలో జరిగిన బొగ్గు గని ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది.

బొగ్గు గనిలో భారీ పేలుడు.. 25 కు చేరిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్ డెస్క్: ఫిబ్రవరి 5న మేఘాలయలోని ఈస్ట్ జైంతియా హిల్స్ (East Jaintia Hills) జిల్లాలో జరిగిన బొగ్గు గని ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. థాంగ్స్కు ప్రాంతంలోని ఒక అక్రమ 'ర్యాట్ హోల్' బొగ్గు గని ('Rat Hole' coal mine) లో డైనమైట్ పేలుడు సంభవించడంతో పదుల సంఖ్యలో కార్మికులు మైన్ లోపల చిక్కుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు రెస్క్యూ ఆపరేషన్ (Rescue operation) ప్రారంభించారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 25 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. పేలుడు ధాటికి గని లోపలి భాగం కుప్పకూలిపోవడంతో, లోపల పని చేస్తున్న కార్మికులు శిథిలాల కింద చిక్కుకుని మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది అస్సాం, నేపాల్‌కు చెందిన వలస కూలీలే ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు గని లోపల చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. శనివారం నాటికి గని నుండి 25 మృతదేహాలను వెలికి తీసినట్లు రెస్క్యూ టీమ్ వెల్లడించింది. ఇంకా ఎవరైనా లోపల చిక్కుకున్నారా అనే కోణంలో గాలింపు కొనసాగుతోంది. గాయపడిన మరికొందరు కార్మికులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గని లోపల గాలి వెలుతురు సరిగ్గా లేకపోవడం, కుప్పకూలిన శిథిలాల వల్ల సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతోంది.

ఈ ఘటనపై మేఘాలయ ప్రభుత్వం (Government of Meghalaya) సీరియస్ అయింది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (NGT) నిషేధించిన ప్పటికీ, అక్రమంగా గనిని నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై పోలీసులు ఇద్దరు యజమానులను ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ విషాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అక్రమ మైనింగ్‌కు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా అధికారులను ఆదేశించారు.

Next Story