- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత గడ్డపైనే విమానాల తయారీ.. త్వరలోనే కల నిజం కాబోతోంది: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
భారత్ త్వరలోనే సొంతంగా విమానాలను తయారు చేస్తుందని కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు. కలాం నాలెడ్జ్ సెంటర్ ప్రారంభోత్సవంలో కీలక వ్యాఖ్యలు!

దిశ, వెబ్ డెస్క్: ఇకపై భారత గడ్డపైనే విమానాలు తయారు చేస్తామని, త్వరలోనే కల నిజం కాబోతోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan Naidu) స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (Aeronautical Society of India)లో 'డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నాలెడ్జ్ సెంటర్'ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ త్వరలోనే సొంతంగా విమానాలను తయారు చేసే దిశగా అడుగులు వేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీయంగా విమానాల తయారీ అనేది చిరకాల వాంఛ అని, 'భారతీయ వాయుయాన్ అధినియం' ద్వారా ఈ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని ఆయన తెలిపారు. భారత్ కేవలం విమానాల నిర్వహణకే పరిమితం కాకుండా, డిజైన్, తయారీలో అంతర్జాతీయ కేంద్రంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.
అలాగే 2047 నాటికి 'వికసిత్ భారత్' సంకల్పాన్ని సాధించడంలో సైన్స్ అండ్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తాయని, అబ్దుల్ కలాం వంటి మహనీయుల స్ఫూర్తితో యువత ఈ రంగంలోకి రావాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రస్తుతం రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రోగ్రామ్పై వేగంగా పనిచేస్తోందని, దీనివల్ల త్వరలోనే మేడ్ ఇన్ ఇండియా విమానాలు గగనవిహారం చేస్తాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో సాధించే పురోగతి ఆరోగ్యం, విద్య వంటి అన్ని రంగాలపై సానుకూల ప్రభావం చూపుతుందని, విమానయాన రంగంలో స్వయం సమృద్ది సాధించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటుందని ఆయన పేర్కొన్నారు.






