పెద్దవూరలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

by Batti.Sumithra |

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన పెద్దవూర మండల పరిధిలోని తెప్పలమడుగు గ్రామ సమీపంలోని అమ్మ రైస్ మిల్ వద్ద చోటుచేసుకుంది.

పెద్దవూరలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
X

దిశ, పెద్దవూర : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన పెద్దవూర మండల పరిధిలోని తెప్పలమడుగు గ్రామ సమీపంలోని అమ్మ రైస్ మిల్ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దవూర మండలం పెద్దగూడెం గ్రామానికి చెందిన చెవుల నగేష్ (32) ఆదివారం తన మోటార్‌ సైకిల్‌ పై పెద్దగూడెం నుంచి బయలుదేరి పెద్దవూరలో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరయ్యాడు. అనంతరం సాయంత్రం అదే మోటార్‌ సైకిల్‌ పై పెద్దవూర నుంచి పెద్దగూడెం వెళ్తుండగా, తెప్పల మడుగు గ్రామ శివారులోని అమ్మ రైస్ మిల్ సమీపానికి చేరుకున్నాడు.

అదే సమయంలో పెద్దవూర నుంచి హాలియా వైపు వెళ్తున్న లారీని నగేష్ ఓవర్‌టేక్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో లారీ డ్రైవర్ ధనకొండ మణికంఠ నిర్లక్ష్యంగా లారీని కుడివైపు తిప్పడంతో మోటార్‌ సైకిల్ లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నగేష్ రోడ్డు పై పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన అదే గ్రామానికి చెందిన నవీన్ వెంటనే 108 అంబులెన్స్‌లో నగేష్‌ను నాగార్జునసాగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి సమయంలో నగేష్ మృతి చెందాడు. మృతుడి భార్య చెవుల మాధవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ ధనకొండ మణికంఠ పై పెద్దవూర పోలీస్ స్టేషన్‌లో కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ గోపాల్‌రావు తెలిపారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.

Next Story