- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భవానీపూర్ నుండి మమతా బెనర్జీ నామినేషన్.. మళ్ళీ సువేందుతోనే ఢీ
పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేడి! భవానీపూర్ నుండి మమతా బెనర్జీ నామినేషన్. సువేందు అధికారితో మరోసారి బిగ్ ఫైట్. మే 4న ఫలితాలు.

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి తన నామినేషన్ను దాఖలు చేశారు. కోల్కతాలోని సర్వే బిల్డింగ్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆమె తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్ నుండే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అమెను నందిగ్రామ్ నియోజకవర్గంలో సువేందు అధికారి ఓడించిన విషయం తెలిసిందే. అనంతరం ఉప ఎన్నికల్లో విజయం సాధించారు.
నామినేషన్ వేసిన అనంతరం బయటకు వచ్చిన మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. "ప్రతి ఒక్కరికీ నా అభినందనలు, కృతజ్ఞతలు, గౌరవపూర్వక వందనాలు, నా సలామ్, నా జై జినేంద్ర, సత్ శ్రీ అకాల్ తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను నామినేషన్ దాఖలు చేసిన సందర్భంలో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను.. భవానీపూర్ నియోజకవర్గంతో పాటు, రాష్ట్రంలోని ప్రతి కేంద్రం, ప్రతి ప్రాంతం కోసం నేను పనిచేస్తాను. మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆమే ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.
హై-వోల్టేజ్ పోరు
ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీకి మళ్ళీ తన పాత ప్రత్యర్థి, బీజేపీ నేత సువేందు అధికారితోనే పోటీ ఎదురుకానుంది. సువేందు అధికారి ఇప్పటికే భవానీపూర్, నందిగ్రామ్ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించి, ఏప్రిల్ 2న నామినేషన్ దాఖలు చేశారు. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్లో మమతా బెనర్జీపై సువేందు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భవానీపూర్ వేదికగా మరోసారి ఈ ఇద్దరు దిగ్గజ నేతల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది.
ఎన్నికల షెడ్యూల్
బెంగాల్ లో ఉన్న మొత్తం 294 స్థానాలకు రెండు దశల్లో ఏప్రిల్ 23 మరియు ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. బీజేపీని 'బయటి వ్యక్తులు'గా అభివర్ణిస్తూ మమతా బెనర్జీ ప్రచారం సాగిస్తుండగా, టీఎంసీ గూండాయిజాన్ని అంతం చేస్తామని బీజేపీ సవాల్ విసురుతుంది. 'లక్ష్మీర్ భండార్' పథకం ద్వారా మహిళలకు నెలకు రూ. 1,500 నుంచి రూ. 1,700 వరకు అందిస్తామన్న హామీతో టీఎంసీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. మరీ ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో తెలియాలంటే మే 4 సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.






