ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయండి : డీసీసీ అధ్యక్షుడు

by Batti.Sumithra |

టీపీసీసీ చీఫ్ సొంత నియోజకవర్గం నిజామాబాద్ అర్బన్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయడం పార్టీ శ్రేణులు బాధ్యతగా తీసుకోవాలని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు.

ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయండి : డీసీసీ అధ్యక్షుడు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : టీపీసీసీ చీఫ్ సొంత నియోజకవర్గం నిజామాబాద్ అర్బన్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయడం పార్టీ శ్రేణులు బాధ్యతగా తీసుకోవాలని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జీలు, బీఎల్‌ఏ సూపర్‌వైజర్లకు ఎస్‌ఐఆర్ ప్రక్రియ పై శనివారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్‌చార్జీలు, బీఎల్‌ఏ సూపర్‌వైజర్లు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి ఓటరికి చేరువ కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను అర్బన్ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో విజయవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఇది పీసీసీ అధ్యక్షుడి సొంత నియోజకవర్గం కావడంతో పార్టీ నాయకులు మరింత బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి డివిజన్‌కు మెంటర్లను నియమించినట్లు ఆయన తెలిపారు. డివిజన్‌లలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి పార్టీ నాయకులు కలిసి ఓటర్లకు ఫారాలు నింపడంలో సహాయపడాలని సూచించారు. ప్రత్యేక క్యాంపులు నిర్వహించి, ఇంటింటికీ వెళ్లి ఓటర్ల నుంచి ఫారాలు సేకరించి వాటిని నింపేందుకు వాలంటీర్లను నియమించాలని పేర్కొన్నారు. కాంటెస్టెడ్ కార్పొరేటర్లు, కార్పొరేటర్లు, బీఎల్‌ఏ సూపర్‌వైజర్లు తమ తమ డివిజన్‌లలో ప్రత్యేకంగా వాలంటీర్లను నియమించుకుని ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని రామకృష్ణ సూచించారు. ఈ సమావేశంలో నుడా చైర్మన్ కేశ వేణు, ఎస్‌ఐఆర్ అర్బన్ కో-ఆర్డినేటర్ ఆకుల లలితలతో పాటు సీనియర్ నాయకులు రత్నాకర్, జావీద్ అక్ఱమ్, అర్బన్ ఈఆర్‌వో కో-ఆర్డినేటర్ అబ్దుల్ వహీద్, డీసీసీ ఉపాధ్యక్షుడు రత్నాకర్ గౌడ్, డీసీసీ కార్పొరేషన్ ఉపాధ్యక్షుడు విజయ్ పాల్ రెడ్డి, సలీం, కోశాధికారి సకినాల శివ, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్‌చార్జీలు, బీఎల్‌ఏ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Next Story