మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. 10 మంది దుర్మరణం

by Malleboina Mahesh |   (  Updated:2026-03-16 02:21:35  IST  )

కటక్ ఎస్‌సీబీ ఆస్పత్రి ఐసీయూలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది రోగులు దుర్మరణం. షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమిక నిర్ధారణ. మృతుల కుటుంబాలకు ₹25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం.

మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. 10 మంది దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: మెడికల్ కాలేజీలోని ఆస్పత్రిలో అగ్నిప్రమాదం (fire hazard) చోటు చేసుకొని 10 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన సోమవారం తెల్లవారుజామున ఒడిశా రాష్ట్రంలోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి, కటక్ ఎస్‌సీబీ (SCB)మెడికల్ కాలేజీలోని ఆస్పత్రిలో చోటుచేసుకుంది. తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో హాస్పిటల్‌లోని ఎమర్జెన్సీ వార్డులో ఉన్న ట్రామా కేర్ ఐసీయూ (ICU) మొదటి అంతస్తులో భారీగా మంటలు చెలరేగాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు.

ఈ ఘటనలో ఐసీయూలో చికిత్స పొందుతున్న 10 మంది రోగులు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఏడుగురు ఐసీయూ లోపలే మంటలు, దట్టమైన పొగ కారణంగా చనిపోగా, మరో ముగ్గురు రోగులను ఇతర వార్డులకు తరలిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందారు. సహాయక చర్యల్లో పాల్గొన్న 23 మంది ఆసుపత్రి సిబ్బంది కూడా దట్టమైన పొగ పీల్చడం వల్ల అస్వస్థతకు గురై ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది.

ఈ ఘోర ప్రమాదంపై ఒడిశా సీఎం(Odisha CM) తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ (Mohan Charan Majhi) స్వయంగా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి ₹25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా (₹25 lakh Ex-gratia)ను ప్రకటించారు. అలాగే ఈ ఘటనపై సమగ్ర జ్యుడీషియల్ విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించడమే కాకుండా, విధుల్లో నిర్లక్ష్యం వహించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అగ్నిమాపక యంత్రాలు సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో భారీ ప్రమాదం తప్పినప్పటికీ, నిస్సహాయ స్థితిలో ఉన్న రోగులు ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. ప్రస్తుతం ఐసీయూలోని ఇతర రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

Next Story