మంత్రి బెయిల్‌కు రూ.3కోట్లు డిమాండ్: నవాబ్ మాలిక్ కుమారుడి ఫిర్యాదు

by Disha Web Desk 17 |
మంత్రి బెయిల్‌కు రూ.3కోట్లు డిమాండ్: నవాబ్ మాలిక్ కుమారుడి ఫిర్యాదు
X

ముంబై : మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ లీడర్ నవాబ్ మాలిక్‌‌ను మనీలాండరింగ్ కేసులో గత నెల ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయనను బెయిల్ మీద బయటకు తీసుకువచ్చేందుకు గుర్తు తెలియని వ్యక్తి తనను రూ.3 కోట్లు డిమాండ్ చేశాడని ఆరోపిస్తూ మంత్రి తనయుడు అమీర్ మాలిక్ బుధవారం అర్ధరాత్రి వీబీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఓ పోలీసు అధికారి గురువారం తెలిపారు.

ఈ సందర్భంగా పోలీసు అధికారి మాట్లాడుతూ.. తనను తాను ఇంతియాజ్‌‌గా పేర్కొంటూ ఓ వ్యక్తి మంత్రి మాలిక్‌ను బెయిల్‌పై బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తానని, అందుకు బిట్‌కాయిన్‌ రూపంలో రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు అమీర్ మాలిక్ ఫిర్యాదు చేశారు. దీంతో సెక్షన్ 419 (వ్యక్తిగతంగా మోసం చేసినందుకు శిక్ష), 420 (మోసం), ఐటీ చట్టంలోని నిబంధనలతో సహా వివిధ భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. కాగా, పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం సహాయకులతో ముడిపడి ఉన్న ఆస్తి ఒప్పందంపై నవాబ్ మాలిక్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 23న మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ అరెస్టు చేసింది.


Next Story