చేనేతపై జీఎస్టీ తొలగించాలని ప్రధాని మోడీకి మహా వస్త్ర లేఖ

by Disha Web Desk 13 |
చేనేతపై జీఎస్టీ తొలగించాలని ప్రధాని మోడీకి మహా వస్త్ర లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని పూర్తిగా రద్దు చేసే వరకు పోరాటం ఆగదని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధి లో శుక్రవారం హజారేను అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ఆధ్వర్యంలో పద్మశాలి సంఘం నాయకులు కలిశారు. 2017 లో ప్రస్తుత కేంద్రం 5 శాతం పన్ను జీఎస్టీ రూపంలో విధించిందని, దీనిని పూర్తిగా తొలగించాలని దేశవ్యాప్తంగా చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలపాలని, ఢిల్లీలో చేపట్టే ర్యాలీలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా అన్నా హజారే మాట్లాడుతూ.. స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ చరఖాను ఆయుధంగా మలిచారని, అలాంటి చేనేత వస్త్రం పై ఎలాంటి పన్నులు ఉండకూడదన్నారు. జీఎస్టీ కౌన్సిల్ కు లేఖ రాస్తానని చెప్పారు. చేనేత రంగంపై ఆధారపడ్డ 40 లక్షల చేనేత కుటుంబాలు జీఎస్టీ తొలగించే వరకు గాంధేయ మార్గంలో ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. అఖిలభారత పద్మశాలి సంఘం, చేనేత విభాగం ఆధ్వర్యంలో చేనేతపై జీఎస్టీ తొలగించాలని ప్రధాని మోడీకి రాసిన మహా వస్త్ర లేఖపై (చేనేత వస్త్రం) అన్నా హజారే తొలి సంతకం చేశారు.

ఎంపీలు, వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సంతకాల సేకరణ జరుగుతుందని అఖిలభారత పద్మశాలి సంఘం, చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు కండగట్ల స్వామి, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, ప్రతినిధులు మిట్టపల్లి చంద్రకాంత్, మహేష్ యంజాల్, బుస సురేష్, వల్లకాటి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed