పొంచి ఉన్న ప్రమాదం.. బాధ్యత ఎవరిది..?

by Ratna Kumari |

బాన్సువాడ పట్టణంలోని డైలీ మార్కెట్‌, అర్ఫాత్ కాలనీల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదకర స్థితిలో ఉండటంతో స్థానికులు, వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పొంచి ఉన్న ప్రమాదం.. బాధ్యత ఎవరిది..?
X

దిశ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని డైలీ మార్కెట్‌, అర్ఫాత్ కాలనీల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదకర స్థితిలో ఉండటంతో స్థానికులు, వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. డైలీ మార్కెట్‌కు ప్రతిరోజూ వందలాది మంది కూరగాయలు, పండ్లు, నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం వస్తుంటారు. అదే విధంగా అర్ఫాత్ కాలనీలో కూడా ప్రజల రాకపోకలు అధికంగా ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు రక్షణ కంచె లేకుండా ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం, ట్రాన్స్‌ఫార్మర్లకు తగిన రక్షణ కంచె లేకపోవడంతో పాటు భద్రతా ప్రమాణాలు కూడా సరిగా అమలు కావడం లేదని చెబుతున్నారు.

ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులు అధికంగా సంచరించే ప్రాంతాలు కావడంతో ప్రమాదం జరిగితే తీవ్ర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాల ముప్పు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానిక వ్యాపారులు కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించే కంటే ముందుగానే రక్షణ చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అర్ఫాత్ కాలనీలోని ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో ప్రైవేట్ పాఠశాల ఉండటంతో విద్యార్థుల భద్రత దృష్ట్యా దానిని వెంటనే వేరే ప్రాంతానికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే డైలీ మార్కెట్‌లోని ట్రాన్స్‌ఫార్మర్‌కు రక్షణ కంచె ఏర్పాటు చేసి భద్రతా ప్రమాణాలు అమలు చేయాలని సంబంధిత ట్రాన్స్‌కో, విద్యుత్ శాఖ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story