ఖానాపూర్‌లో చిరుత పులి కలకలం.. అప్రమత్తమైన అటవీ శాఖ

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-28 05:07:35  IST  )

మండల కేంద్రంలోని రాగంపేట శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది.

ఖానాపూర్‌లో చిరుత పులి కలకలం.. అప్రమత్తమైన అటవీ శాఖ
X

దిశ, ఖానాపుర్: మండల కేంద్రంలోని రాగంపేట శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. శివారులో విస్తారంగా పామాయిల్ తోటలు ఉండటంతో నక్కల వర్రే కాలువ వెంబడి మనుబోతులగడ్డ, పోచారం అటవీ ప్రాంతాల నుంచి పులి వచ్చినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన నాగ అనే వ్యక్తికి చిరుత పులి కనిపించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో గ్రామంతో పాటు మండలంలోని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

చిరుత పులి సంచారం.. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. చిరుత పులి కనిపించినట్లు చెబుతున్న ప్రాంతంలో పాదముద్రలు, ఇతర ఆనవాళ్ల కోసం దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా పొలాలు, అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. చిరుత సంచారం వార్తతో రాగంపేట, పరిసర గ్రామాల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

Next Story