దేవాదుల పైప్‌లైన్‌లో లీకేజీలు

by Ratna Kumari |

మండలంలోని జే.చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకంలో పైప్‌లైన్ లీకేజీల కారణంగా భారీగా నీరు వృథా అవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేవాదుల పైప్‌లైన్‌లో లీకేజీలు
X

దిశ, కన్నాయిగూడెం : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని జే.చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకంలో పైప్‌లైన్ లీకేజీల కారణంగా భారీగా నీరు వృథా అవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేవాదుల ప్రాజెక్టులో 10 మోటార్లలో 9 మోటార్లను వినియోగిస్తూ సుమారు 2,306 క్యూసెక్కుల వరద నీటిని భీంఘన్‌పూర్ రిజర్వాయర్‌కు ఎత్తిపోస్తున్నారు. అయితే ముకునూరు–కనుకునూరు గ్రామాల మధ్య పైప్‌లైన్‌లో గత 7 నుంచి 10 రోజులుగా సుమారు 5 నుంచి 6 చోట్ల గేట్ వాల్వ్‌ల వద్ద లీకేజీలు ఏర్పడి పెద్దఎత్తున నీరు వృథాగా పోతోందని స్థానికులు చెబుతున్నారు.

లీకైన నీరు వాగుల ద్వారా తిరిగి దేవాదుల పంప్‌హౌస్ సమీపంలోని గోదావరిలో కలుస్తుండటంతో నీటితో పాటు విద్యుత్ కూడా వృథా అవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన ఇంజినీరింగ్, సాగునీటి శాఖ అధికారులు సమస్యను గుర్తించినప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నీటిని ఎత్తిపోసే పనులపై చూపుతున్న శ్రద్ధ, పైప్‌లైన్ లీకేజీల నివారణపై కనిపించడం లేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పైప్‌లైన్ లీకేజీలను వెంటనే మరమ్మతు చేసి విలువైన నీటి వృథాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story