చందన్‌వెల్లి డేటా సెంటర్‌ను ప్రారంభించండి : సీఎం రేవంత్‌రెడ్డి

by Muthe.Rajitha |

చందన్‌వెల్లి డేటా సెంటర్ ప్రాజెక్టును వీలైనంత తొందరగా ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

చందన్‌వెల్లి డేటా సెంటర్‌ను ప్రారంభించండి : సీఎం రేవంత్‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: చందన్‌వెల్లి డేటా సెంటర్ ప్రాజెక్టును వీలైనంత తొందరగా ప్రారంభించాలని.. రాష్ట్రంలో మరింత పెద్ద సమగ్ర డేటా సెంటర్, ఏఐ మౌలిక సదుపాయాల క్యాంపస్‌ను ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డితో ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ బోధీ పెవిలియ‌న్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలంగాణలో చేపట్టిన అనేక కార్యక్రమాలు, సంస్కరణలను వివరిస్తూ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిన అంశాలను ప్రస్తావించారు. ప్రత్యేకంగా విద్యా రంగంలో తీసుకొస్తున్న సంస్కరణలు, ప్రభుత్వ పాఠశాలలను ప్రక్షాళన చేస్తున్న తీరును వివరించారు. పారిశ్రామిక రంగ అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రత్యేకంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు, ఐటీఐలను అధునాతన సాంకేతిక విధానాలతో ఏటీసీలుగా మార్చిన విషయాలను తెలిపారు. పాలిటెక్నిక్ కాలేజీల అధునికీకరణ గురించీ చెప్పారు.

అలాగే.. హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ డిజిటల్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ కార్యకలాపాలపైనా దృష్టి పెట్టాలని మిట్టల్‌కు సూచించారు. రాష్ట్రంలో భవిష్యత్ పెట్టుబడి అవకాశాలు, సమస్యలను పరిష్కరించడం కోసం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేలా ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను నామినేట్ చేసి స‌మ‌న్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సునీల్ మిట్టల్ మాట్లాడుతూ.. భార‌తీ పౌండేష‌న్ ద్వారా ప్రభుత్వ పాఠ‌శాల‌లు, ఏటీసీల్లో చ‌దువుకునే విద్యార్థుల‌కు స్కాల‌ర్ షిప్‌లు అందజేస్తామ‌ని తెలిపారు. అలాగే.. ఎయిర్‌టెల్‌కు రెండో హెడ్ క్వార్టర్‌గా హైద‌రాబాద్‌ను పరిగణిస్తున్నామని చెప్పారు. డేటా సెంట‌ర్ల కెపాసిటీని మ‌రింత పెంచ‌డానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. తెలంగాణలో ఫైబ‌ర్ క‌నెక్టివిటీ మ‌రింత పెంచ‌డంపైనా ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు పాల్గొన్నారు.

Next Story