'మమ్మల్ని చచ్చిపోమంటారా..? భూ నిర్వాహితులకు.. పోలీసులకు మధ్య తోపులాట

by Dishafeatures2 |
మమ్మల్ని చచ్చిపోమంటారా..? భూ నిర్వాహితులకు.. పోలీసులకు మధ్య తోపులాట
X

దిశ,మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామనుజవరం గ్రామ భూ నిర్వాసితుల కష్టాలను తీర్చే నాధుడే లేరని భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులా..రాక్షసులా అంటూ అధికారులపై దుమ్మెత్తి పోశారు. ఈ మేరకు శనివారం రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. రామనుజవరం ప్రాంతంలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు అధికారులు సరైన న్యాయం చేయకుండా, దౌర్జన్యంగా వారి భూములను రైల్వే నిర్మాణం కోసం లాక్కుంటున్నారని భూ నిర్వాసితులు వాపోయారు.

అధికారులు కుంటకు రూ.10 వేలు ఇస్తున్నారని.. దీంతో మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. దీంతో అధికారులు బలవంతంగా భూ నిర్వాసితుల భూముల్లో రైల్వే నిర్మాణ పనులు చేస్తుంటే.. భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు వచ్చి భూ నిర్వాసితులపై దౌర్జన్యం చేసి నెట్టివేశారు. దీంతో వారి మధ్య భారీ తోపులాట జరిగింది. దీంతో నిర్వాసితులపై పోలీసుల జులుం నశించాలంటూ జై జవాన్.. జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. ఈ తోపులాటలో పలువురు భూ నిర్వాసితులకు గాయాలయ్యాయి.


దీంతో 'మా కుటుంబాలను చచ్చిపోమంటారా' అంటూ అధికారులను భూ నిర్వాతులు ప్రశ్నించారు. ప్రభుత్వం మీకు ఉద్యోగాలు ఇచ్చింది ఇందుకేనా అంటూ తమ గోడును వెల్లబుచ్చారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ భూ నిర్వాసితులకు ఏవిధంగా ప్యాకేజీ, ఉద్యోగం కల్పించారో అదే మాదిరిగా మాకు వర్తింపజేయాలని భూనిర్వాసితులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో భూ నిర్వాసితుల పక్షాన నాయకులు పోరాడుతుంటే... పోలీసులు తోపులాట చేస్తూ పలువురు నాయకులను అరెస్ట్ చేశారు. దీంతో రామనుజవరం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, అధికారులు భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని పలువురు నాయకులు కోరారు. లేనిచో భూనిర్వాసితుల పక్షాన పోరాటం చేస్తూ రహదారులు దిగ్బంధం చేసి, ధర్నాలు, రాస్తా రోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు.



Next Story

Most Viewed