ఆగ‌ని పోడు భూముల పోరు.. ఆ అధికారుల విధుల‌కు ఆటంకం!

by Disha Web Desk 13 |
ఆగ‌ని పోడు భూముల పోరు.. ఆ అధికారుల విధుల‌కు ఆటంకం!
X

దిశ, ఏటూరునాగారం: ములుగు జిల్లాలో పోడు భూముల స‌మ‌స్య మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. ఏటూరునాగారం మండ‌లంలోని గోగుప‌ల్లి, శివాపుర్ శివారులోని లింగాపూర్ లో మంగళవారం రోడ్డుపై బైఠాయించారు. వివ‌రాల్లోకి వెళితే.. ఏటూరునాగారం అట‌వీశాఖ అధికారులు లింగాపూర్ బీట్ లో ఎటువంటి పోడు భూ హ‌క్కు ప‌త్రాలు క‌లిగి లేకుండా సాగు చేసుకుంటున్న భూమిలో అట‌వీశాఖ ఉన్నతాధికారుల అదేశాల మేర‌కు ఆ ప్రాంతంలో ప్లాంటేష‌న్ చేసేందుకు ట్రేంచ్ ప‌నుల నిమిత్తం కొంత‌మంది సిబ్బందితో పోక్లిన‌ర్ స‌హ‌యంతో వెళ్ళసాగారు.


ఇది గ‌మ‌నించిన పోడు రైతులు గోగుప‌ల్లి ప్రవేశ మార్గం వ‌ద్ద గోత్తి కోయ‌ల సాయంతో రోడ్డుపై బైఠాయించి అడ్డుకున్నారు. ఎఫ్ఆర్‌వో ల‌క్ష్మీనారాయ‌ణ, డీఆర్ వో న‌రేంద‌ర్ లు వారికి న‌చ్చజేప్పే ప్రయ‌త్నం చేసిన‌ప్పటికీ.. పోడు రైతులు మా బతుకులు పోడు వ్యవ‌సాయంపైనే అధార‌ప‌డి ఉన్నాయ‌ని ఇప్పుడు మీరు ఆ భూముల‌లో కందకాలు త‌వ్వితే మా బతుకులు మళ్ళీ చిన్నబిన్నం అవుతాయని ఆవేద‌న వ్యక్తం చేశారు.


దీనికి స్పందించిన డీఆర్‌వో న‌రేంద‌ర్ మాట్లాడుతూ.. త‌మ‌కి పోడు భూ హ‌క్కు ప‌త్రాలు క‌లిగి ఉంటే సంబంధిత ప‌త్రాల‌ను అట‌వీశాఖ కార్యాల‌యంలో స‌మ‌ర్పించి పోడు వ్యవ‌సాయం చేసుకోవాలన్నారు. కానీ ఎలాంటి భూ హ‌క్కు ప‌త్రాలు లేకుండా అట‌వీని నాశ‌నం చేస్తూ.. దీనిని అపడానికి వ‌చ్చిన అధికారుల‌ను అడ్డుకోవ‌డం స‌రి కాద‌న్నారు. కాగా పోడు రైతులు అట‌వీ అధికారులు ఎంత చెప్పిన విన‌కుండా క‌ర్రలతో రోడ్డు పైనే భైఠాయించారు. ఇక చేసేది ఏమి లేక స్థానిక పోలీసులు రంగంలోకి దిగ్గారు. మీరిలా అటవీ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఘటన స్థలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇరసవడ్ల వెంకన్న స్పందించి టీఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూములకు హక్కు పత్రాలు కల్పిస్తామని చెప్పి.. మాటలు దాటవేస్తూ ఇప్పటికీ హక్కు పత్రాలు ఇవ్వకుండా పోడు వ్యవసాయాన్ని చేసుకుంటున్న భూములలో అటవీశాఖ అధికారులని పంపి కందకాలు తవ్వించే తీరుపై మండిపడ్డారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే స్పందించి పోడు రైతులకు భూ హక్కు పత్రాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీట్ ఆఫీసర్లు, పోలీస్ సిబ్బంది, సీఆర్పీఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed