- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను జైలులో పరామర్శించిన కేటీఆర్
చంచల్గూడ కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు గురువారం పరామర్శించారు.

దిశ, చంపాపేట్ : చంచల్గూడ కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్తో ప్రత్యేకంగా సమావేశమైన కేటీఆర్, ఆయన ఆరోగ్య పరిస్థితి, కేసు వివరాలు, జైలులో ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి తెలుసుకున్నారు.
కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పరామర్శ అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్, రాజకీయ కక్షసాధింపు ధోరణిలో భాగంగానే బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్న నాయకులను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఎలాంటి ఒత్తిళ్లు, ఇబ్బందులు వచ్చినా బీఆర్ఎస్ నాయకులు వెనుకడుగు వేయరని, పార్టీ తమ కార్యకర్తలు, నాయకులకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
బాల్క సుమన్ ధైర్యంగా ఉన్నారని, న్యాయపరంగా ఈ వ్యవహారాన్ని ఎదుర్కొంటారని కేటీఆర్ తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు పార్టీ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ పరామర్శతో జైలు పరిసరాల్లో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు జైలు వద్దకు చేరుకుని బాల్క సుమన్కు సంఘీభావం ప్రకటించారు. పార్టీ నాయకత్వం ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.






