యాదాద్రి దేవుడి దగ్గర సీఎం కేసీఆర్ నీచపు రాజకీయాలు.. కోమటిరెడ్డి ఫైర్

by Disha Web Desk |
MP Komatireddy Venkat Reddy
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: ప్రపంచం అబ్బురపడేలా నిర్మించిన యాదాద్రి ఆలయ పునఃప్రారంభ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు వివాదస్పదమవుతోంది. యాదాద్రి పునఃప్రారంభానికి అంతా కుటుంబ సమేతంగా రావాలంటూ అధికార యంత్రాంగం పిలుపునిచ్చింది. కానీ ప్రోటోకాల్ ప్రకారం కొంతమంది ప్రజాప్రతినిధుల విషయంలో వివక్షత చూపినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ట్విట్టర్‌లో సీఎం కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

యాదాద్రి ఆలయ పునఃప్రారంభానికి స్థానిక భువనగిరి ఎంపీనైనా నన్ను ఆహ్వానించలేదంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రోటోకాల్ పాటించలేదంటూ విమర్శించారు. తెలంగాణ సీఎంఓ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రం ఆహ్వానించిందని మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడి దగ్గర నీచపు రాజకీయాలు చేయడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి.

మరోవైపు ఇటీవల కాలంలో భువనగిరి కలెక్టరేట్, జనగామ కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరై.. సీఎం కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తిన సంగతి తెలిసిందే. కానీ అనంతరం ప్రధాని మోదీని కలవడం వంటి పరిణామాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందలేదా..? మరేదైనా కారణం ఉందా..? నిజంగానే అధికారులు మర్చిపోయారా..? అన్నది తెలియాలి.



Next Story

Most Viewed